తలచిందొకటి, జరిగిందొకటి- టీటీడీ దెబ్బకు జగన్ ఏడాది పాలన సంతోషం ఆవిరి- ఇప్పుడెలా ?

కరోనాతో ప్రపంచదేశాలే అతలాకుతలమైన వేళ ఆంధ్రప్రదేశ్ పరిస్ధితి కూడా అంతకన్నా గొప్పగా ఏమీ లేదు. ఇలాంటి పరిస్ధితుల్లో ఆదాయం పెంచుకునేందుకు జగన్ సర్కారు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు. మద్యంతో పాటు ఇతర మార్గాల్లో ఆదాయం కోసం ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. దాదాపుగా అన్ని ప్రభుత్వ శాఖలూ, విభాగాలూ ఆదాయం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇదే కోవలో టీటీడీ చేసిన భూముల అమ్మకం ప్రయత్నం బెడిసి కొట్టడంతో పాటు ఏడాది పాలన పూర్తిచేసుకుంటున్న జగన్ సర్కార్‌ కు తలనొప్పిగా మారిపోయింది. అయితే ఇందులో తప్పెవరిదైనా అంతిమంగా సీఎం జగన్ సంతోషం మాత్రం ఆవిరవుతోంది.

 ఆదాయం కోసం వేటలో తప్పటడుగు...

ఆదాయం కోసం వేటలో తప్పటడుగు...

3 లక్షల కోట్ల రూపాయల అప్పులున్న రాష్ట్రం ఆదాయం కోసం ప్రభుత్వ భూములను అమ్ముకోవాలన్న నిర్ణయం వాస్తవానికి ఇది తొలిసారి ఏమీ కాదు. 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వం విభజిత రాష్ట్రంలో అప్పుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో టీటీడీ భూముల అమ్మకం ప్రతిపాదన కూడా వచ్చింది. ఇందుకు సంబంధించి ఓ దశ వరకూ ముందుకెళ్లిన టీటీడీ.. భక్తుల మనోభావాలతో ఆటలాడుకుంటున్నారన్న విమర్శలు రాగానే వెనక్కి తగ్గింది. అయితే ప్రభుత్వం మారినా అదే భక్తులు, అదే విమర్శకులు ఉంటారన్న వాస్తవాన్ని జగన్ సర్కార్ విస్మరించింది. కరోనా వేళ ఆదాయం పెంపు కోసం అదీ ఇతర రాష్ట్రంలో టీటీడీ భూములు అమ్మడం వల్ల ఇబ్బందులు ఉండవన్న వాదనకే మొగ్గుచూపింది. చివరికదే కొంపముంచింది.

 విమర్శలతో వెనకడుగు....

విమర్శలతో వెనకడుగు....

ప్రభుత్వ వ్యవహారాల్లో సీఎం జగన్ ను ఆరంభం నుంచీ గమనిస్తున్న వారు ప్రతీసారీ చెప్పే మాట ఒకటే. ఏదైనా నిర్ణయం తీసుకోవడానికే ఆలోచన తప్ప ఓసారి జగన్ నిర్ణయం తీసుకుంటే దాన్ని మార్చడం ఎవరి తరమూ కాదు. ఓసారి పట్టుబట్టారా అది అమలయ్యే వరకూ పట్టువీడని మనస్తత్వం జగన్ ది. తనకు అందినట్లే అంది దూరమైన సీఎం పదవి కోసం అప్పట్లో దేశంలోనే శక్తిమంతురాలుగా ఉన్న సోనియాగాంధీని సైతం ఎదిరించి మరీ జైలుకెళ్లేందుకూ సిద్ధమైన తత్వం జగన్ ది. ప్రభుత్వ నిర్ణయాల్లో సైతం అదే దూకుడు. ప్రతిసారీ తన మార్కు ఉండాలన్న తపన. ప్రతీ నిర్ణయం వెనుక రెండువైపులా పదునున్న కత్తిలా అది తనకు ఉపయోగపడాలి, ప్రత్యర్ధులకు ముచ్చెమటలు పట్టించాలి. అదే స్పీడుతో దూసుకెళ్తున్న జగన్ టీటీడీ భూముల విషయంలో మాత్రం ఒక్కసారిగా డిఫెన్స్ లో పడాల్సి వచ్చింది. ఇంటా బయటా విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా ముందుకెళ్లేందుకు సిద్ధమైన జగన్ కు స్వరూపానంద రూపంలో భారీ బ్రేక్ పడింది. దీంతో తక్షణం బాబాయ్ సుబ్బారెడ్డికి ఫోన్ చేసి నిర్ణయాన్ని ఆపాల్సి వచ్చింది.

ఏడాది పాలన పూర్తయిన వేళ...

ఏడాది పాలన పూర్తయిన వేళ...

గతేడాది ఏపీలో కనీవినీ ఎరుగని స్ధాయిలో అఖండ మెజారిటీతో అధికారం అందుకున్న వైసీపీ సర్కారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా చేయలేని విధంగా ఒకే విడతలో లక్షా 27 వేల ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డులు తిరగరాసింది. రెండున్నర లక్షల కోట్ల అప్పులున్నా సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ పరుగులు తీయిస్తున్న జగన్ ఇదే ఒరవడి కొనసాగిస్తే మరో నాలుగేళ్లలో దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో కూడా ముందుండే పరిస్ధితి. అదే సమయంలో టీటీడీ భూముల విక్రయం నిర్ణయం జగన్ సర్కారుకు అతిపెద్ద మచ్చగా మారిపోయింది.

 ఏడాది పాలన కంటే ఇదే చర్చ...

ఏడాది పాలన కంటే ఇదే చర్చ...

టీటీడీ భూముల విక్రయం వంటి సున్నితమైన నిర్ణయాన్ని అంతా సాఫీగా సాగుతున్నప్పుడు, ప్రభుత్వం సానుకూలతలో ఉన్నప్పుడు, అంతా సవ్యంగా సాగుతున్నప్పుడు తీసుకుంటే సరిపోయేది. కానీ ఇప్పుడు కరోనా దెబ్బకు రాష్ట్రం మరింత అప్పుల్లోకి కూరుకుపోయింది. మద్యం అమ్మకాలతో ఆ లోటు భర్తీ చేసుకునే పరిస్ధితి కనిపించడం లేదు. కొత్తగా అప్పులు పుట్టడం లేదు. కేంద్ర సాయం అంతకన్నా లేదు. అయినా ఏడాది పాలనలో చెప్పుకోదగిన ఎన్నో విజయాలు ఉన్నాయి. మిగతా అంశాల్లో విమర్శలను సైతం అధిగమించేలా అవి ఉన్నాయి. వీటిని ప్రచారం చేసుకునేలోపే టీటీడీ భూముల నిర్ణయం జగన్ ను కమ్మేసింది. ఏడాది పాలన గొప్పతనాన్ని ప్రచారం చేసుకునేందుకు ఎంతగా ప్రయత్నిస్తున్నా టీటీడీ భూముల చర్చ దానిని ముందుకు సాగనీయడం లేదు. ఈ పరిస్ధితిని ప్రభుత్వం అధిగమించాలంటే మరికొన్నాళ్లు వేచి చూడక తప్పేలా లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+