TTD: తిరుమలలో వేసవి రద్దీ నేపధ్యంలో ముందస్తు చర్యలు; సమీక్షలో కీలక సూచనలు!!
తిరుమలలో కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి అన్ని సీజన్లోనూ భక్తులు బారులు తీరుతారు. ముఖ్యంగా వేసవి కాలంలో అయితే భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. వేసవి కాలంలో విద్యార్థులకు పరీక్షలు ముగిసి సమ్మర్ హాలిడేస్ వచ్చే నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు.
ఈసారి వేసవికాలం విపరీతంగా ఎండలు మండుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఈ వేసవిలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం టిటిడి విశేషమైన ఏర్పాట్లు చేయనుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే లక్షలాది భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవడానికి టిటిడి సిద్ధమైంది. టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

తిరుమలలోని అన్నమయ్య భవనంలో నిన్న సాయంత్రం జులై వరకు కొనసాగుతున్న వేసవి సెలవుల యాత్రికుల రద్దీకి సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన, ఈ వేసవి కాలంలో వచ్చే భక్తులకు అందించవలసిన సౌకర్యాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఈవో ధర్మారెడ్డి భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో చలువ పెయింట్లు వేయాలని సూచించారు.
తిరుమలలో ఎక్కడా త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని, అన్ని ప్రాంతాలలోనూ తాగునీటి సరఫరా చేయడానికి ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మొదటి ఘాట్ రోడ్లోని అక్కగార్ల గుడి, శ్రీవారి సేవ సదన్ తో పాటు తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో చలువ రంగులు వేయాలన్నారు. ఈ వేసవిలో వచ్చే యాత్రికులకు అసౌకర్యం కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని ఆదేశించారు.
ఈసారి ఎండలు తీవ్రంగా ఉంటాయి అంటున్న క్రమంలో యాత్రికుల కోసం ఓఆర్ఎస్ ప్యాకెట్లను తగినంత నిల్వ ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించారు. యాత్రికుల అవసరాలను తీర్చడానికి తగినంత లడ్డూల బఫర్ స్టార్ ను ఉంచాలని సూచించారు. తిరుమల వచ్చే భక్తులకు ఎండాకాలంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అందుకు తగిన విధంగా చర్యలు చేపట్టాలని టిటిడి ఈవో అధికారులకు సూచించారు. ఎవరి పరిధిలో వారు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications