స్కాం: టీవీ ఛానళ్ల హైజాక్ 'జాదూ', విదేశాల్లో 6సెకన్లలో
హైదరాబాద్: హిందీ, తెలుగు, తమిళ వినోద ఛానళ్ల ప్రసారాలను హైదరాబాద్ కేంద్రంగా ఓ వ్యాపారి హైజాక్ చేస్తున్నారు. సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్రసారాలను ఆరు సెకన్ల తేడాతో ఆస్ట్రేలియా, అమెరికా, యూరప్, అరబ్ దేశాలు సహా 125 దేశాల్లో ప్రసారం చేస్తున్నారు. అంటే హైదరాబాదులో ఆయా టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే కార్యక్రమం ఆరు సెకన్ల తేడాతో విదేశాల్లో అనధికారికంగా ప్రసారమవుతుంది.
కేబుల్ కనెక్షన్ లేదా డిష్ కనెక్షన్ అలాంటివేవీ లేకుండా అన్ని ఛానళ్లు వచ్చేలా చేస్తారు. వీక్షింప చేస్తారు. కానీ, ఎలాంటి కేబుళ్లూ, డిష్లతో పని లేకుండా అదీ విదేశాల్లోని తెలుగు వీక్షకులకు అన్ని ఛానళ్లనూ అందుబాటులోకి తెచ్చేలా చేస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా నాలుగైదేళ్ల నుండి సాగుతున్న ఈ భారీ కుంభకోణాన్ని సీసీఎస్ పోలీసులు ఎట్టకేలకు బట్టబయలు చేశారు. అయితే, దీనికి సంబంధించిన వివరాల వెల్లడికి మాత్రం నిరాకరిస్తున్నారు.
ఈ మొత్తం కుంభకోణంలో మాజిద్ అనే యువకుడు సూత్రధారి కాగా, మరికొందరు పాత్రధారులతో కలసి బోయినపల్లిలోని ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ను అద్దెకు తీసుకున్నారు. అక్కడ 'జాదూ' పేరుతో ఓ చానల్ ప్రారంభించి ఈ పనికి పాల్పడుతున్నారు. ప్రధాన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
జాదూ టీవీ పేరుతో సుమిత్ అహుజా ఏడేళ్ల క్రితం ఒక కేబుల్ నెట్ వర్క్ ప్రారంభంచాడు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు ముఖ్యంగా తెలుగు, హిందీ, మరాఠీ, తమిళులను లక్ష్యంగా చేసుకొని దీన్ని ప్రారంభించాడు. విదేశాల్లోని వారికి సెట్ టాబ్ బాక్స్ ద్వారా 150 ఛానళ్లను ప్రసారం చేస్తానంటూ చెప్పాడు. విదేశాల్లో సెట్ టాప్ బాక్సులను విక్రయించాడు. సుమారు లక్షకు పైగా సెట్ టాప్ బాక్సులు విక్రయించారు. కాగా, వీటి ద్వారా కోట్ల నష్టం టీవీ యాజమాన్యాలకు వస్తోంది.