పరిటాల రవి తనయుడు శ్రీరామ్ పేరుతో బెదిరింపులు
అనంతపురం: అనంతపురం జిల్లా హిందూపురంలో చేనేత వ్యాపారులను బెదిరిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. జిల్లాలో ప్రముఖ వాణిజ్య కేంద్రంగా పేరొందిన హిందూపురం పట్టణంలో ముదిరెడ్డిపల్లికి చెందిన ఆనంద్, రఘు చేనేత వ్యాపారం చేస్తుంటారు.
ముదిరెడ్డిపల్లిలో పేరున్న వ్యక్తులైన వీరిద్దరినీ, డబ్బుకోసం ఇద్దరు ఆకతాయిలు 20రోజులుగా బెదిరిస్తూవచ్చారు. తమకు దివంగత పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరామ్ సన్నిహితుడని, తాము అడిగిన 20లక్షల రూపాయలు ఇవ్వకపోతే ఎంతకైనా తెగిస్తామని ఆ ఇద్దరు దుండగులు ఫోన్లో బెదిరించారు. దాదాపు 15రోజులుగా వారి బెదిరింపులకు భయపడుతూ వస్తున్న ఆనంద్, రఘు ఈ విషయాన్ని పోలీసులకు వివరించారు.

కేసు దర్యాప్తు చేపట్టిన హిందూపురం వన్టౌన్ సీఐ మురళీకృష్ణ ఆ ఇద్దరు ఆకతాయిలను పట్టుకొని శనివారం కోర్టులో హాజరుపరిచారు. నిందితులు సోమందేపల్లి మండలం, బ్రహ్మసముద్రం గ్రామానికి చెందిన చాకలి మల్లికార్జున, చాలకూరు ప్రసాద్గా పోలీసులు పేర్కొన్నారు. నిందితులిద్దరూ చాలా కాలంగా పరిటాల కుటుంబం పేరుతో సెటిల్మెంట్లు నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఈ విషయంపై మంత్రి పరిటాల సునీత స్పందించారు. పరిటాల కుటుంబం పేరుతో సెటిల్ మెంట్లు, డబ్బు డిమాండ్లకు పాల్పడితే తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి పోలీసులను ఆదేశించారు. ఎవరైనా తమ కుటుంబం పేరుతో బెదిరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆమె, ప్రజలకు సూచించారు.
తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవి గతంలో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆయన ఎన్టీ రామారావు ప్రభుత్వ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన సతీమణి పరిటాల సునీత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మంత్రివర్గంలో పనిచేస్తున్నారు.












Click it and Unblock the Notifications