శ్రీహరికోట షార్ సెంటర్లో ఆత్మహత్యల కలకలం.. 24 గంటల్లో ఇద్దరి ఆత్మహత్య!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో 24 గంటల వ్యవధిలో ఇద్దరు సిఐఎస్ఎఫ్ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఇద్దరు ఉద్యోగుల ఆత్మహత్య స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలను సీరియస్ గా తీసుకున్న అధికారులు అసలు ఆత్మహత్యలకు గల కారణాలు ఏమిటి అన్న దానిపై దర్యాప్తు మొదలుపెట్టారు.

ఆత్మహత్యకు పాల్పడిన కానిస్టేబుల్ చింతామణి
నిన్న చత్తీస్ గడ్ రాష్ట్రానికి చెందిన చింతామణి అనే కానిస్టేబుల్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. 29 సంవత్సరాల చింతామణి 2021 లో కానిస్టేబుల్ గా ఎంపిక అయ్యారు. శిక్షణ అనంతరం శ్రీహరికోటలోని యూనిట్లో ఆయన విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల నెలరోజుల పాటు దీర్ఘకాలిక సెలవుపై సొంతూరుకి వెళ్లి ఈనెల పదవ తేదీన తిరిగి వచ్చిన చింతామణి నిన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఆత్మహత్యకు పాల్పడిన సబ్ ఇన్స్పెక్టర్ వికాస్ సింగ్
ఇదిలా ఉంటే నిన్న సాయంత్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మొదటి గేటు వద్ద కంట్రోల్ రూమ్ లో విధుల్లో ఉన్న బీహార్ కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ వికాస్ సింగ్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిన్న సాయంత్రం బీహార్ కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ వికాస్ సింగ్ గన్ తో తలపై కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వికాస్ సింగ్ కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే ఒకేరోజు కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమిటి అన్న దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

మృతి వెనుక కారణాలను అన్వేషిస్తున్న పోలీసులు
వీరి మృతి వెనక కారణాలు ఏమిటి? వ్యక్తిగతమైన సమస్యలా లేక డ్యూటీ పరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? వీరిద్దరి మృతికి ఏమైనా లింకుందా.. వంటి విషయాలపై ఫోకస్ చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానిస్టేబుల్ చింతామణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి చత్తీస్గడ్ రాష్ట్రంలోని అతని స్వగ్రామానికి తరలించారు. ఇక నేడు వికాస్ సింగ్ మృతదేహానికి కూడా పోస్టుమార్టం నిర్వహించనున్నారు. అయితే ఈ మిస్టరీ ఆత్మహత్యల వెనుక అసలేం జరిగిందన్నది మాత్రం ప్రస్తుతం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో పని చేస్తున్న వారిలో ఆందోళనకు కారణంగా మారింది.












Click it and Unblock the Notifications