వైయస్ జగన్ పార్టీలోకి మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
హైదరాబాద్: కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు త్వరలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశాలున్నాయి. మాజీ మంత్రి పార్థసారథి, మరో ఎమ్మెల్యే మల్లాది విష్ణులు జగన్ పార్టీ వైపు చూస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన నేపథ్యంలో పార్థసారథి కొద్ది రోజుల క్రితం రాజీనామా చేశారు.
నాటి నుండి ఆయన కాంగ్రెసు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అంతేకాదు... గత నెలలో జరిగిన ఉయ్యూరు నగర పంచాయతీ ఎన్నికలలో ఆయన కాంగ్రెసు పార్టీ తరఫున ప్రచారం చేయలేదని గుర్తు చేస్తున్నారు. చర్చోపచర్చల అనంతరం పార్థసారథి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారంటున్నారు.
ఆయన 2009 సాధారణ ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ తరఫున పెనమలూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ స్థానం కోసం జగన్ పార్టీలో ఇప్పటికే పోటా పోటీ నెలకొని ఉండటం గమనార్హం.
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా జగన్ పార్టీ వైపు చూస్తున్నారంటున్నారు. అతను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధిష్టానంతో ఇప్పటికే టచ్లో ఉన్నారట. 2009లో తాను గెలుపొందిన నియోజకవర్గం నుండే జగన్ తనకు టిక్కెట్ ఇస్తారని ఆయన భావిస్తున్నారంట.