విశాఖలో వైసీపీ జాబ్ మేళా-25 వేల ఉద్యోగాలు-రేపటి నుంచి రెండ్రోజుల పాటు-వివరాలివే
రాష్ట్రవ్యాప్తంగా వరుసగా ప్రాంతీయ జాబ్ మేళాలు నిర్వహిస్తున్న అధికార వైసీపీ ఇప్పుడు విశాఖకు చేరుకుంది. వైజాగ్ లోని ఆంధ్రా యూనివర్శిటీలో రేపటి నుంచి రెండు రోజుల పాటు జాబ్ మేళా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ వివరాల్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ వెల్లడించారు.
విశాఖలో రేపటి నుంచి రెండు రోజుల పాటు అంటే 23, 24 తేదీల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. ఇక్కడ 206 కంపెనీలు రిజిస్టర్ చేసుకున్నాయని, అవసరం అయితే సోమవారం కూడా దీన్ని కొనసాగిస్తామని సాయిరెడ్డి తెలిపారు. ఈ జాబ్ మేళా కోసం 77 వేల మంది ఉద్యోగార్థులు రిజిస్టర్ చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. మొత్తం 23,935 ఖాళీలు ఇక్కడ భర్తీ చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. దాదాపు 25 వేల ఉద్యోగాలు అందుబాటులో ఉంచామన్నారు. అంటే కుటుంబంలో నలుగురిని లెక్క వేసుకున్నా, దాదాపు లక్ష మంది ముఖాల్లో చిరునవ్వులు చూడబోతున్నామని ఆయన వెల్లడించారు.
ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్న 206 కంపెనీలకు 206 రూమ్లు కేటాయించామన్నారు. ప్రతి రూమ్ వద్ద ఆ కంపెనీకి సంబంధించి పూర్తి వివరాలు ప్రదర్శిస్తారని, ఏయే ఉద్యోగాలు, ఏయే అర్హతలు కావాలన్నది రూమ్ దగ్గర స్పష్టంగా ప్రదర్శిస్తామని సాయిరెడ్డి తెలిపారు. ప్రతి బ్లాక్లో వేర్వేరుగా ఫార్మా, ఐటీ, బీపీఓ, బ్యాంకింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, టెక్స్టైల్స్, ఇన్సూరెన్స్, మార్కెటింగ్ వంటి తొమ్మిది విభాగాలుగా విభజించి రూమ్లు కేటాయించామన్నారు. ఇందుకోసం 13 భవనాల్లో 206 గదులు సిద్దం చేశామన్నారు.
క్యూఆర్సీ (క్విక్ రెస్పాన్ప్ కోడ్) ద్వారా విద్యార్థులు తమ అర్హతలకు తగిన భవనాన్ని ఎంపిక చేసుకుని అక్కడికి వెళ్లాల్సి ఉంటుందని సాయిరెడ్డి తెలిపారు. ప్రతి భవనం దగ్గర హెల్ప్ డెస్క్లు ఉంటాయన్నారు. అక్కడ కావాల్సిన పూర్తి సమాచారం ఇస్తారని తెలిపారు. కియోస్క్లు కూడా ఉంటాయన్నారు. ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి, ముందు జాగ్రత్తగా మూడు వైద్య బృందాలు ఏర్పాటు చేస్తున్నామని సాయిరెడ్డి వెల్లడించారు. వైజాగ్ కు వచ్చిన 206 కంపెనీలకు ఒకొక్కరికి 4గురు వాలంటీర్లు, ప్రతి భవనానికి 5గురు టీచర్లను నియమించినట్లు సాయిరెడ్డి తెలిపారు. ఆ మేరకు 860 మంది వలంటీర్లు ఇక్కడ సేవలందించనున్నారు. అవసరం అయితే సోమవారం కూడా కార్యక్రమం నిర్వహించి 30 వేల మందికి ఉద్యోగాలు వచ్చేలా ప్రయత్నిస్తామన్నారు.
విద్యార్థులు కావాలంటే అయిదారు రెస్యూమ్స్ తెచ్చుకోవచ్చని, వారు కోరుకున్న ఉద్యోగం కోసం ప్రయత్నించవచ్చన్నారు. ఆ మేరకు ఇంటర్వ్యూలకు హాజరు కావొచ్చన్నారు.ప్రతి రూమ్ దగ్గర అక్కడ ఏయే ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. అర్హతలు ఏం కావాలి? ఎక్కడ ఆ ఖాళీలున్నాయి? ఎంత మందిని భర్తీ చేస్తారన్న అన్ని పూర్తి వివరాలు ప్రదర్శిస్తారని సాయిరెడ్డి తెలిపారు.
జాబ్మేళా లాంఛనంగా శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభిస్తామని, 15 నిమిషాల్లోనే దాన్ని పూర్తి చేస్తామన్నారు.అయితే అప్పటికే ఉదయం 8.30 గంటలకే ఇంటర్వ్యూలు మొదలై సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రతి రోజూ సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు స్నాతకోత్సవ మందిరంలో నియామక పత్రాలు ఇస్తామని సాయిరెడ్డి వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూలకు దాదాపు 50 వేల మంది హాజరు కావొచ్చని అంచనా వేస్తున్నారు. ఎక్కడైనా ఆయా సంస్థల ఉన్నతాధికారుల అనుమతి కావాల్సి వస్తే, ఆ విద్యార్థులకు మాత్రం ఒక వారం రోజుల్లో నియామక పత్రాలు పంపడం జరుగుతుంది. అలాగే ఈ జాబ్మేళా నిరంతరం కొనసాగుతుందన్నారు. కాబట్టి ఉద్యోగాలు రాని వారు నిరాశ చెందవద్దని సాయిరెడ్డి కోరారు.