బాలికల కిడ్నాప్, అత్యాచార యత్నం: బాబాయ్ - అబ్బాయిల వరుస అఘాయిత్యాలు
గుంటూరు జిల్లా: అర్ధరాత్రి వేళ ఇళ్లలో అందరూ ఆదమరిచి నిద్రించే సమయంలో గుట్టు చప్పుడు కాకుండా వస్తారు...పక్కనే నిద్రిస్తున్న బాలికలను కిడ్నాప్ చేస్తారు...అక్కడ నుంచి దూరంగా తీసుకువెళ్లి...అత్యాచారయత్నం చేస్తారు...వారికి ఇదే నిత్యకృత్యం...ఇదంతా ఏ క్రైమ్ సినిమా స్టోరీ నో కాదు...నిజంగా గుంటూరు జిల్లాలో జరిగిన దారుణాల పరంపర...ఈ ఘోరానికి ఒడిగడుతోంది బాబాయ్ అబ్బాయ్ వరుసైన బంధువులు కాగా వారికి మరో నీచుడు తోడయ్యాడు...
అయితే ఎట్టకేలకు ఆ దుర్మార్గుల పాపం పండింది...వరుస ఘటనలతో అప్రమప్తమైన స్థానికులు ఈ నీచులు మరో దారుణానికి పాల్పడే ప్రయత్నంలో ఉండగా గమనించి వెంటాడారు. ఆ తర్వాత ఓ స్కూల్ వెనుక దాక్కుని ఉన్న వీరిని పట్టుకొని దేహశుద్ది చేశారు.. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. గుంటూరు జిల్లాలో సంచలనం సృష్టించిన ఉదంతమిది.
వినుకొండ మండలం శృంగారపురం డిగ్రీ కాలేజ్ సమీపంలో నివసించే షేక్ భాషా, పోలం పోలయ్య వరుసకు బాబాయి అబ్బాయ్ అవుతారు. కామంతో కళ్లు మూసుకుపోయిన వీరిద్దరూ తమ కోరికలు తీర్చుకునేందుకు మార్గం అన్వేషించారు. అభం శుభం తెలియని బాలికలను తమ కామ వాంఛలను తీర్చుకోవడానికి వాడుకోవాలని నిర్ణయించుకున్నారు.
దీంతో పట్టణంలోని ముట్లకుంట కాలనీ, శృంగారపురంలోని ఇళ్లలో నిద్రిస్తున్నబాలికల పై కన్నేసిన ఈ దుర్మార్గులు రాత్రివేళల్లో వారి ఇళ్ల వద్ద మాటు వేసి అదను చూసి అపహరించుకుపోయి ఆ తరువాత వారిపై అత్యాచార యత్నానికి పాల్పడుతున్నారు.

వరుస ఘటనలు...
పదిరోజుల క్రితం ముట్లకుంట కాలనీకి చెందిన మూడో తరగతి చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆ తరువాత పాపని అక్కడే వదిలి వెళ్లడంతో కిడ్నాప్ చేసింది ఎవరో తెలియకున్నా వారు అత్యాచార యత్నం చేసినట్లు బాధిత బాలిక తన తల్లిదండ్రులకు చెప్పిన మాటలను బట్టి అర్ధం అయింది. ఇదిలా ఉండగా బాషా, పోలయ్య వీరిద్దరూ శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో అదే కాలనీలోని మరో బాలికను అపహరించే ప్రయత్నం చేయగా తల్లిదండ్రులు గమనించి కేకలు వేశారు.

అప్రమప్తమైన స్థానికులు
దీంతో నిందితులు అక్కడినుంచి పరారయ్యారు. అదే క్రమంలో శృంగారపురంలో మరో 12 ఏళ్ల బాలికను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారని, బాలిక నాయనమ్మ వీరిని గుర్తించి కేకలు వేయటంతో పరారయ్యారు. అయితే బాలికలను అపహరించేందుకు వరుస ప్రయత్నాలు జరుగుతుండటంతో అప్రమప్తమైన స్థానికులు పరిసర ప్రాంతాలపై నిఘా పెట్టారు. అయితే కామంతో మదమెక్కి ఉన్న నిందితులు మరికొద్దిసేపటికే మరో వీధిలోని 11 ఏళ్ల బాలికను అపహరించే ప్రయత్నంలో స్థానికులకు పట్టుబడ్డారు. తీసుకెళ్లే ప్రయత్నంలో నిందితులు పట్టుబడ్డారు.

ఈ నీచులు పట్టుబడింది ఇలా...
బాలికను కిడ్నాప్ చేసేందుకు ఓ ఇంటివద్దకు చేరుకున్న నిందితులు ముందు ఆ బాలిక అనుకొని ఆమె సోదరుడిని తీసుకెళ్లబోయారు. తేడా గుర్తించి మళ్లీ బాలికను అపహరించే ప్రయత్నంలో ఉండగా బాలిక కుటుంబీకులు గమనించి కేకలు వేశారు.ఆ తరువాత బాలిక కుటుంబసభ్యులు, స్థానికులంతా అక్కడికి చేరుకొని నిందితుల కోసం గాలించగా సమీపంలోని పాఠశాల వద్ద నక్కి ఉన్న వీరిని గమనించి పట్టుకున్నారు. ఆ తరువాత బాగా దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

వారిపై కిడ్నాప్ కేసులు
ఒకేరోజు నిందితులు వివిధ ప్రాంతాల్లో బాలికల కిడ్నాప్ కు యత్నించిన నేపథ్యంలో జరిగిన ఘటనపై ముట్లకుంట కాలనీ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు అప్పటికే పోలీస్ స్టేషన్ కు వచ్చిశున్నారు. తమను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించింది వీరే నని బాలికలు గుర్తించడంతో పోలీసులు వారిపై కిడ్నాప్ కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.పట్టుబడిన వారిలో భాషా పాత నేరస్తుడని, గతంలో దొంగతనం కేసులో ఇతనికి శిక్ష కూడా పడిందని పోలీసులు తెలిపారు. వీరితో పాటు వచ్చిన మరో వ్యక్తి పారిపోయినట్లు బాధితులు చెబుతున్నారు. అమాయకులైన బాలికలను అపహరించి అత్యాచారం చేయబోయిన ఈ దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని అందరూ కోరుతున్నారు.












Click it and Unblock the Notifications