కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నడూ లేనివిధంగా దుకుడైన రాజకీయం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రాలేకపోతే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్న బాబు దాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రకటనలు, సీనియర్లను పక్కన పెట్టడంలాంటివన్నీ ఆయన తనయుడు, పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ దర్శకత్వంలోనేని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు.

మాజీ మంత్రులకే సీటుందా? లేదా?
చంద్రబాబునాయుడి సొంత ఆలోచనల ప్రకారమైతే ఆయన పనితీరు ప్రణాళికా బద్ధంగా ఉంటుందని, గతంలో కూడా ఆయన ఎన్నికలకు ముందే ఒక ప్రణాళిక రూపొందించుకొని దాని ప్రకారం పార్టీ శ్రేణులను సిద్ధం చేసేవారని, కానీ ఇప్పుడు లోకేష్ జోక్యంతో చేసిన పనిని ఒకటికి రెండుసార్లు సరిజూసుకోవాల్సి వస్తోందంటూ నేతలు వాపోతున్నారు. నియోజకవర్గాలవారీగా ఇన్ఛార్జిలను నియమించుకుంటూ వస్తోన్న చంద్రబాబు కొందరితో పనిచేసుకోమని చెప్పి పంపిస్తున్నారు. వారందరికీ దాదాపుగా టికెట్ ఖాయమైనట్లే. మరికొందరితో మాత్రం మాట్లాడి ఏ విషయం తేల్చకుండా పంపిస్తున్నారు. వారిలో మాజీ మంత్రులు కూడా ఉన్నారు. వీరికి రాబోయే ఎన్నికల్లో సీటుంటుందా? లేదా? అనే విషయంలో స్పష్టత లేదు.

సీనియర్లకు సీటివ్వకపోవడంవెనక లోకేష్
పార్టీ పరంగా ఎటువంటి కీలక నిర్ణయం తీసుకున్నా లోకేష్ నుంచి చంద్రబాబుకు రావాల్సిందేనని, దీనివల్ల సీనియర్లకు ఇబ్బందులు కలుగుతున్నాయని సమాచారం. పార్టీలో ఇప్పుడు రెండు ''పవర్ సెంటర్లు'' ఏర్పాడ్డాయి. కొందరు చంద్రబాబును కాకా పడుతుండగా.. మరికొందరు లోకేష్ ను కలిసి వెళుతున్నారు. నియోజకవర్గాల నుంచి సీట్లు ఆశించేవారు ఒకరు బాబు దగ్గర, ఇంకొకరు లోకేష్ దగ్గరకు వస్తుండటంతో ఎవరికి వారు తమకే సీటు ఖాయమని చెబుతుండటంతో ఆయా నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్లు అయోమయంలో పడుతున్నారు.

సేవలందించడంలో తప్పులేదు కానీ...
చంద్రబాబు తనయుడిగా పార్టీకి సేవలందించడంతోపాటు అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడటంలోను తప్పు లేదని, కానీ తనకు సంబంధంలేని విషయాల్లో తలదూర్చడంతోపాటు, పార్టీపరంగా బాబు తీసుకునే కీలక నిర్ణయాలన్నీ తిరగదోడటానికి ఆయనే కారకుడని సీనియర్ నేతలు వెల్లడిస్తున్నారు. ఇటువంటి తరుణంలో చంద్రబాబు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటేనే పార్టీ బాగుపడుతుందని స్పష్టం చేస్తున్నారు. నియోజకవర్గానికి ఎవరు ఇన్ఛార్జిగా ఉంటారో ముందే ప్రకటించాలని, కానీ ఇప్పుడు కూడా నాన్చుడు ధోరణితో వెళుతున్నారని, ఇది పార్టీకి ప్రమాదంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని చూపిస్తున్నారు. ఇక్కడి నుంచి సీటు ఆశించేవారు ఎవరికి వారు అధినేతను, లోకేష్ ను కలవడంతోపాటు నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. ఈ తరహా గందరగోళానికి తెరదించాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.












Click it and Unblock the Notifications