విద్యార్థినిపై కొన్నేళ్లుగా అఘాయిత్యం: 3సార్లు అబార్షన్, మృతి, టీచర్ల అరెస్ట్
విజయవాడ: పదహారేళ్ల విద్యార్థినిని లొంగదీసుకొని, లైంగికంగా వేధించి ఆమె మృతికి కారణమయ్యారన్న ఆరోపణల పైన కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీసులు ఇద్దరు ఉపాధ్యాయులను అరెస్టు చేశారు. ఆమె చదువుతున్న పాఠశాల ప్రిన్సిపల్తో పాటు మరో ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. అవనిగడ్డ డీఎస్పీ శ్రీనివాస్ శనివారం చల్లపల్లి పీఎస్లో నిందితులను విలేకరుల సమావేశంలో హాజరుపరిచారు.
వక్కలగడ్డ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివరాం ప్రసాద్, మరో ఉపాధ్యాయుడు జనార్ధన్ ప్రసాద్లు ఓ విద్యార్థినిపై చాలాకాలం పాటు లైంగిక దాడికి పాల్పడటమే కాక సదరు విద్యార్థి అకాల మృతికి కారణమయ్యారు. తమ లైంగిక దాడి నేపథ్యంలో మూడుసార్లు గర్భం దాల్చిన విద్యార్థినికి వారు అబార్షన్ చేయించారు. పిన్న వయసులోనే మూడుసార్లు అబార్షన్ కావడంతో ఆ బాలిక 15 రోజుల క్రితం మృత్యువాత పడింది.
అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా వారు జాగ్రత్తలు తీసుకున్నారు. మూడు రోజుల క్రితం వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి ఆదివారం పోలీసులు ఇద్దరు గురువులను అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థిని మృతికి కారణమైన వారిద్దరిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. వారి ప్రోద్బలంతో బాలికకు అబార్షన్ చేసిన వైద్యశాలపైనా చర్యలు తీసుకునేందుకు పోలీసులు సమాయత్తమవుతున్నారు.
కాగా, విద్యార్థినిపై దారుణానికి ఒడిగట్టిన ప్రధానోపాధ్యాయుడు ఉత్తమ ఉపాధ్యాయుడిగా గతంలో అవార్డు పొందినట్లు తెలుస్తోంది. విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడ్డ నేపథ్యంలో అవార్డును ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బాలిక పదిహేను రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొంది మృతి చెందింది. ఉపాధ్యాయులు ఆమెను బెదిరించి లొంగదీసుకున్నారు.
శివరాం ప్రసాద్ విజ్ఞాన ప్రదర్శనల పేరుతో విద్యార్థులను ఇతర ప్రాంతాలకు తీసుకు వెళ్లేవారు. ఆ బృందంలోని ఓ విద్యార్థిని పైన కన్నేసి లైంగికంగా వేధించారు. ఆమె తల్లిదండ్రులు చిరు వ్యాపారం చేసుకుంటారు. బాలికను లొంగదీసుకున్న ఆయన బెదిరించి కొన్నేళ్లుగా లైంగికంగా వేధించాడు. విషయం తెలుసుకున్న అదే పాఠశాల ఉపాధ్యాయుడు జనార్ధన్ ప్రసాద్ కూడా ఆమెను బెదిరించి లైంగికంగా వేధించాడు.
ఈ ఏడాది జనవరి నెలాఖరున శివరాంప్రసాద్ ఉద్యోగ విరణ చేసి వేరే ప్రయివేటు పాఠశాలలో చేరారు. మంచి మార్కులు తెప్పిస్తామని ఆమె తల్లిదండ్రులకు నమ్మబలికి తనతో పాటు ఆమెను కూడా ఆ ప్రయివేటు పాఠశాలకు తీసుకు వెళ్లారు. అనంతరం ఇంటర్మీడియట్లో చేర్పించారు. ఇటీవల ఆమె అనారోగ్యానికి గురై మృతి చెందింది.