ఉదయ్ కిరణ్ ఆత్మహత్య: మెగా టార్గెట్ చిరంజీవి
హైదరాబాద్: ఎప్పుడు ఓ పిడుగు మీద పడుతుందో తెలియదు. ప్రమేయం ఉన్నా, లేకున్నా ఊహించని రీతిలో లక్ష్యాలుగా మారిపోవచ్చు. మెగాస్టార్, కేంద్ర మంత్రి చిరంజీవి ఇప్పుడు ఒక వర్గం లక్ష్యంగా మారారు. తెలుగు హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్యతో చిరంజీవిని లక్ష్యం చేసుకుని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేరు చెప్పినా, చెప్పకపోయినా విమర్శలు చేస్తున్నవారు చిరంజీవి కుటుంబాన్ని లక్ష్యం చేసుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతూనే ఉన్నది.
చిరంజీవికి రాజకీయ ప్రత్యర్థులైన తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల నాయకులు ఓ అస్త్రం దొరికినట్లు అయింది. నేరుగా కాకున్నా కొంత మంది తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు నాయకులు చిరంజీవిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరు కూడా మరొకరిని అణిచి వేయాలని ప్రయత్నించవద్దని, ఎవరి బతుకును వారిని బతకనివ్వాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి అన్నారు.
ఆత్మహత్య చేసుకున్న టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ భౌతికకాయాన్ని ఆమె మంగళవారం సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె ఆ వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఎవరిని అణిచివేయవద్దన్నారు. ఎవరి బతుకును వారిని బతకనివ్వాలని కూడా ఆమె అన్నారు. దీన్నిబట్టి ఆమె ఎవరి ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారో అర్థం చేసుకోవచ్చు.
హీరో ఉదయ్ కిరణ్ ఈ రోజు చనిపోలేదని ఆరేళ్ళ క్రితమే చనిపోయాడని, ఆ విషయం ప్రపంచానికి ఈ రోజు తెలిసిందని ప్రముఖ నటుడు విజయచందర్ తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్లో ఉదయ్ కిరణ్ భౌతికకాయానికి ఆయన నివాళులు అర్పించి ఆ విధంగా అన్నారు. విజయ్ చందర్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఉన్న విషయం తెలిసిందే.
ఉదయ్ కిరణ్ ఆత్మహత్య ద్వారా సినిమా ప్రపంచం మొత్తం నేర్చుకోవాల్సింది చాలా ఉందని సూచించారు. సినీ పరిశ్రమలో మార్పురావాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఉదయ్ కిరణ్ ఎందుకు చనిపోయారో ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ ఈ సంఘటన ద్వారా గుణపాఠం నేర్చుకుని అడుగులు వేయాలని విజయ్ చందర్ అన్నారు.
కొన్ని శక్తులు ఉదయ్ కిరణ్ జీవితంలో ఆడుకున్నాయని దర్శకరత్న దాసరి నారాయణ పరోక్షంగా చిరంజీవిపై విమర్శలు చేశారు. ఉదయ్ కిరణ్ డిప్రెషన్లోకి వెళ్లడంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని దాసరి అన్నారు. చిరంజీవిని లక్ష్యం చేసుకున్నారనే విషయం ఉదయ్ కిరణ్ అంత్యక్రియల సమయంలో చేసిన నినాదాలను ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చు.