రాజభవన్లో ఉగాది: బాబు రాక ముందే వెళ్లిపోయిన కెసిఆర్
హైదరాబాద్: రాజభవన్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ముఖాముఖి కలుసుకోలేదు. రాజ్భవన్లో మన్మథనామ ఉగాది వేడుకలు శుక్రవారం సాయంత్రం వైభంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ కార్యాలయ వర్గాలు ముఖ్యమంత్రిని సాధరంగా ఆహ్వానించారు.
కెసిఆర్కు గవర్నర్ నరసింహన్ ఆత్మీయ సత్కారం చేశారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. దేశ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది వేడుకల ద్వారా గవర్నర్ చక్కని సంప్రదాయాన్ని ప్రారంభించారని ఆయన అన్నారు. వేడుకలను నిర్వహించిన గవర్నర్కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర సత్వర అభివృద్ధికి, ప్రజా ప్రయోజనాలకు కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

జయనామ సంవత్సరంలో తెలంగాణ ప్రజలు కోరుకుంది నెరవేరిందని, ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, మన్మథనామ సంవత్సరం ఈ విషయంలో విజయాన్ని చేకూర్చి పెడుతుందని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. మన్మథనామ సంవత్సరంలో దేశానికి ఖ్యాతి పెరగనుండడం సంతోషకరమని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా రాజభవన్లో జరిగిన ఉగాది వేడుకలకు హాజరయ్యారు. అయితే, చంద్రబాబు రావడానికి ముందే కెసిఆర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఇరువురు ముఖ్యమంత్రులు కలుసుకోలేకపోయారు. తెలుగువారి అనుబంధం విడదీయరానిదని చంద్రబాబు అన్నారు. ఉగాది వేడుకల ద్వారా గవర్నర్ ఉన్నతమైన సంప్రదాయాన్ని నెలకొల్పారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications