జైలుకు పంపే కేసులేమీ లేవు, జగన్ సీఎం ఐతే డైరెక్టుగానే, బాబే ఐతే..: ఉండవల్లి సంచలనం
Recommended Video

హైదరాబాద్/అమరావతి: మాజీ పార్లమెంటుసభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైయస్ జగన్పై ప్రస్తుతం విచారణలో ఉన్న కేసులేవీ ఆయన్ను జైలుకు పంపించేంత పెద్ద కేసులేవీ కాదని, ఈ విషయాన్ని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానన్నారు.

జగన్ నేరస్థుడని ఆధారాల్లేవు..
ఛార్జ్షీట్ లోని సమాచారంలో ఏదీ విచారించి కనుగొన్నది కాదని ఉండవల్లి అన్నారు. అంతేగాక, తన ఉద్దేశంలో జగన్ నేరస్తుడని చెప్పే ఆరోపణలు, దాన్ని నిరూపించే ఆధారాలు ఈ కేసుల్లో లేవన్నది తన అభిప్రాయమని ఉండవల్లి చెప్పారు. ఇండియాలో ఇంతవరకూ 'క్విడ్ ప్రొకో' అన్న కేసు నిరూపితమైన ఘటన ఒక్కటి కూడా లేదని గుర్తు చేశారు.

వైయస్ ముద్దాయి అవుతారు కానీ.. జగన్ కాదు..
"మురళీ అనే వ్యక్తి ఫ్యాక్టరీకి 1 టీఎంసీ నీరిచ్చారు. అందుకు ప్రతిఫలంగా జగన్ కంపెనీలో ఆయన పెట్టుబడులు పెట్టారు. ఇది క్విడ్ ప్రొకో అంటున్నారు. నిజంగా అలా జరిగివుంటే అందులో ప్రధాన ముద్దాయి ఎవరైనా ఉంటే అది రాజశేఖరరెడ్డి. జగన్ బెనిఫిషరీ. అందుకే ఇది చాలా తప్పుడు కేసు. నావద్ద ఆధారాలు ఉన్నాయి. మురళికి వన్ టీఎంసీ నీరిచ్చినప్పుడే, అరుణ్ కు టూ టీఎంసీల నీరిచ్చారు. అప్పారావుకు త్రీ టీఎంసీల నీరిచ్చారు. అవన్నీ జీవోలు ఉన్నాయి. వాళ్లెవరూ పెట్టుబడులు పెట్టలేదు. మురళి అనేవాడు పెట్టుబడి పెడితే, అది యాధృశ్చికంగా జరిగిందే తప్ప... అలాకాకుంటే వాళ్లు కూడా పెట్టాలిగా?" అని ఉదహరిస్తూ ఉండవల్లి వివరించారు.

జగన్ సీఎం అయితే డైరెక్టుగానే.. బాబు మళ్లీ అయితే..
ఇది ఇలా ఉంటే, వైయస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే.. తనకు తెలిసిన వారే మంత్రులుగా ఉంటారని, ఏదైనా పని చేయించుకోవాల్సి వస్తే, వారి వద్దకు డైరెక్టుగా వెళ్లే అవకాశం లభిస్తుందని ఉండవల్లి అన్నారు. అదే ఇంకోసారి చంద్రబాబు వస్తే.. రహస్యంగా మంత్రులతో మాట్లాడి పని చేయించుకోవాల్సి వస్తుందని ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎల్లప్పుడూ చంద్రబాబును విమర్శించిన వాడిగా ఉండటమే ఇందుకు కారణం కావచ్చని చెప్పారు. ఒకవేళ జగన్ సీఎం అయితే, ఆయనకూ తాను క్రిటిక్గా మారే అవకాశాలు రావచ్చని చెప్పారు.

బాబు, పవన్తో మర్యాదపూర్వకమే
అయితే, గత నాలుగేళ్లలో చంద్రబాబుతో పనులు చేయించుకోవాల్సిన అవసరం రాలేదని చెప్పారు ఉండవల్లి. ఇటీవల తాను చంద్రబాబును మర్యాద పూర్వకంగానే కలిశానని అన్నారు. ఆయన పిలిస్తేనే తాను వెళ్లానని, చంద్రబాబు అపాయింట్మెంట్ను తాను కోరలేదని చెప్పారు. పవన్ కళ్యాణ్ను కూడా ఆయన పిలిస్తేనే వెళ్లి కలిసొచ్చానే తప్ప తనంతట తానుగా వెళ్లలేదని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ పిలవడాన్ని తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు.












Click it and Unblock the Notifications