"బడాబాబులకు నోట్ల రద్దు ముందే తెలుసు.. సాక్ష్యాలివిగో.."
రాజమండ్రి : పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకించడానికి దేశంలోని పలు ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతున్న సంగతి తెలిసిందే. బడాబాబులకు ముందే లీకులు ఇచ్చి.. సామాన్యులను మాత్రం ముప్పు తిప్పలు పెడుతున్నారనేది వారి ఆరోపణ. తాజాగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఇదే ఆరోపణ చేశారు.
పెద్ద నోట్ల రద్దు విషయం మూడు నాలుగు నెలల ముందే చాలామందికి తెలిసిపోయిందని ఆరోపించారు. ప్రధాని మోడీకి సన్నిహితులైన వారికి, బీజేపీ నేతలకు, మిత్రపక్షాలకు ముందస్తు సమాచారం చేరవేశారని, వారంతా సర్దుకున్న తర్వాతే నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారని ఉండవల్లి ఆరోపించారు. మోడీ నిర్ణయంతో సామాన్యులే అష్టకష్టాలు పడుతున్నారని చెప్పుకొచ్చిన ఆయన.. ఇంతవరకూ ఏ ఒక్క బడాబాబు కూడా కొత్త నోట్ల కోసం బ్యాంకుకు రాలేదన్న సంగతి గుర్తు చేశారు.
నోట్ల రద్దు ప్రకటనను అంతకు కొద్ది నెలల ముందుగానే ప్రచురించిన వివిధ వార్తా పత్రికల కథనాలను ఈ సందర్బంగా ఆయన మీడియా ముందుంచారు. నోట్ల రద్దు ప్రకటన చాలామందికి ముందుగానే తెలుసని చెప్పడానికి ఇదే సాక్ష్యం అని పేర్కొన్నారు. ప్రస్తుత తరుణంలో పరిస్థితులు సాధారణ స్థితికి రావాలంటే.. జైట్లీ చెప్పినట్టు రెండు మూడు వారాలు, మోడీ చెప్పినట్టు 50రోజులు సరిపోదని, నెలల నుంచి సంవత్సరాల సమయం పట్టే అవకాశముందని అభిప్రాయపడ్డారు. 86శాతం నగదు పెద్ద నోట్ల ద్వారా చలామణి అవుతున్నప్పుడు ఎన్ని చిన్న నోట్లు తీసుకొచ్చినా.. ప్రజల కష్టాలు తీరే అవకాశం లేదని ఉండవల్లి తెలిపారు.