మానిప్యులేషన్లో బాబు దిట్ట, ప్రతీకారానికి ఎన్టీఆరే నిదర్శనం: ఉండవల్లి, మోడీపై ఫైర్
రాజమండ్రి: బీజేపీతో దోస్తీ చెడిపోయాక ఇన్నాళ్లకు చంద్రబాబుకు ప్రత్యేక హోదా గుర్తుకు వచ్చిందని ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. గతంలో మిగతా వారు పోరాడుతుంటే నీకేం తెలుసు అని అడగడం తప్ప ఏం చేయలేదన్నారు. మానిప్యులేషన్ చేయడంలో చంద్రబాబు దేశంలోనే ఎక్స్పర్ట్ అని పేరు ఉందని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు దుమ్ముదులిపిన ఉండవల్లి అరుణ్ కుమార్
ఆయన వరకు వస్తే ఎంతవరకైనా వెళ్లి ప్రతీకారం తీర్చుకుంటారని చెప్పేందుకు ఎన్టీఆర్ నిదర్శనం అన్నారు. చంద్రబాబు ప్రతీకారం తీర్చుకుంటారని ఎన్టీఆర్ విషయంలో చూశామన్నారు. ఇప్పుడు రాష్ట్రం విషయంలో చంద్రబాబు తన సొంత విషయాన్ని తీసుకు రావొద్దని కోరుతున్నానని చెప్పారు. బీజేపీతో కలిసి ఉన్నన్నాళ్లు చంద్రబాబు ఆ పార్టీని ఏమనలేదన్నారు.
చదవండి: వాడెవడో తిట్టాడని.. పనికిరానిది? నేనైతే ఇలా: విజయసాయి అంశంపై బాబుకు ఉండవల్లి
మోడీ ఎందుకు భయపడుతున్నారో
ఎన్డీయేకు మెజార్టీ ఉన్నప్పటికీ నరేంద్ర మోడీ అవిశ్వాస తీర్మానానికి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని ఉండవల్లి అన్నారు. ఇప్పటి వరకు అవిశ్వాస తీర్మానంపై ప్రభుత్వాలు పడిపోయింది లేదన్నారు. విశ్వాసంతోనే పడిపోయాయన్నారు. అన్నాడీఎంకే, పళనిస్వామిలను కలిపింది మోడీనే అని, ఇప్పుడు వారే వెల్లోకి వెళ్లి నిరసన తెలుపుతున్నారని చెప్పారు. మోడీ వద్దని చెబితే వారు ఊరుకుంటారన్నారు.
స్పీకర్ పదేపదే వాయిదా సరికాదు
వచ్చే నెల 2వ తేదీన అవిశ్వాసం చర్చకు వస్తుందని చెబుతున్నారని ఉండవల్లి అన్నారు. ఆ విషయం పక్కన పెడితే స్పీకర్ పదేపదే సభను వాయిదా వేయడం సరికాదన్నారు. గతంలో వందమంది నిరసన తెలుపుతున్నా లెక్కించారని, ఇప్పుడు ప్లకార్డులు పట్టుకున్నా, నిలబడినా ఎందుకు లెక్కించడం లేదన్నారు. చంద్రబాబు ఢిల్లీలో అవిశ్వాస తీర్మానం జరగడం లేదని ఎక్స్పోజ్ చేయాలన్నారు. బీజేపీ ఏపీకి చేసిన అన్యాయం ఎవరికీ చేయలేదన్నారు.
స్పీకర్ చొరవ తీసుకోవాలి
అవిశ్వాసానికి స్పీకర్ సుమిత్రా మహాజన్ చొరవ తీసుకోవాలని ఉండవల్లి సూచించారు. అవసరమైతే సభ్యులను సస్పెండ్ చేయాలన్నారు. అవిశ్వాసంపై గట్టిగా మాట్లాడాల్సింది టీడీపీ, వైసీపీలే అన్నారు. చర్చకు వస్తే మిగతా రాష్ట్రాలు తమ తమ అంశాలు మాట్లాడుతాయన్నారు. అవసరమైతే చిన్న చిన్న పార్టీలను కోరి వారి సమయం కూడా వీరే తీసుకోవాలన్నారు. ఏపీలో బీజేపీ లేనే లేదాన్నారు. కానీ బీజేపీ వల్లే చంద్రబాబు గెలిచారనేది నిజం అన్నారు.
బీజేపీ సహకారం లేకుండా పాసయ్యేదా
ఎందుకంటే అప్పుడు మోడీ హవా ఉందని ఉండవల్లి అన్నారు. ఇప్పుడు అది లేదన్నారు. 2019లో మళ్లీ మోడీ ప్రధాని వుతాడని, బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవుతుందని తాను అనుకోవడం లేదన్నారు. నాడు తలుపులు మూసి విభజన బిల్లును ఆమోదించారని మోడీ ఇటీవల పార్లమెంటులో అనడం సరికాదన్నారు. అందులో బీజేపీ పాత్ర కూడా ఉందన్నారు. మీ సహకారం లేకుంటే బిల్లు ఎలా పాస్ అయి ఉండేదన్నారు. చంద్రబాబు కూడా నాలుగేళఅలుగా ఏం మాట్లాడకుండా ఇప్పుడు విభేదాలు వచ్చాక బీజేపీని అంటున్నారన్నారు.