ఎపికి జైట్లీ మరో షాక్: విజయవాడ మెట్రో రైలు హుష్కాకి
న్యూఢిల్లీ: తన బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో షాక్ ఇచ్చారు. రాష్ట్ర విభజన చట్టంలో హామీ ఇచ్చిన విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్రం మంగళం పాడినట్లే.
Recommended Video

విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడమే కాకుండా అసలుకే ఎసరు పెట్టినట్లు కనిపిస్తోంది. కొత్త మెట్రో విధానం పేరుతో విభజన హక్కుల చట్టం ప్రకారం విజయవాడకు ఇచ్చిన మెట్రో రైలు ప్రాజక్టు హామీని వదిలేసింది.

గత కేటాయింపులనూ రద్దు చేశారు...
గత మూడు బడ్జెట్లలో విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు కేటాయించిన రూ. 300 కోట్లను కూడా రద్దు చేశారు. విభజన చట్టం ప్రకారం విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు వంద శాతం కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉంది. దేశంలోని సాధారణ మెట్రో ప్రాజెక్టుల మాదిరిగా కేంద్ర, రాష్ట్రాల భాగస్వామ్యంతో కొంత, రుణంతో మరికొంత సేకరించి ఈ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించారు.

ఆమోద ముద్రనే వేయలేదు...
విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు డిపిఆర్ను రూపొందించి కేంద్రానికి పంపిన తర్వాత దానికి ఆమోద ముద్ర వేయలేదు. ముందుకు వెళ్లాల్సిందిగా మౌఖికంగా చెబుతూ వచ్చారు. అలా చెప్పి గత మూడేళ్లు వంద కోట్ల రూపాయల చొప్పున కేటయిస్తూ వచ్చారు కొత్త మెట్రో విధానం ప్రాకంర పిపిపి పద్ధతిలోనే కేంద్రం దానికి పెద్ద పీట వేయాల్సి ఉంది.

ఇతర మెట్రోల్లాగానే పరిగణిస్తూ..
రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టును ప్రత్యేకంగా పరిగణించాల్సి ఉండింది.అయితే, ఇతర నగరాల మెట్రో రైలు ప్రాజెక్టులను మాదిరిగానే దీన్ని కేంద్రం పరిగణించింది. దాంతో నూతన మెట్రో విధానం ప్రకారం ఇంతకు ముందు కేటాయించిన రూ. 300 కోట్లు కూడా రద్దయ్యాయి.

చివరకు ఇలా అయింది...
విజయవాడ మెట్రో రైలుకు అయ్యే వ్యయంలో 60 శాతం నిదులను విదేశీ ఆర్థిక సంస్థల నుంచి తీసుకోవాల్సి ఉంటుంది వాటిని కూడా కేంద్రమే భరించాల్సి ఉంటుంది. కొత్త మెట్రో రైలు విధానం అమలులోకి రావడంతో ప్రత్యేక ప్యాకేజీ ఫలితాలు కూడా విజయవాడ మెట్రో రైలుకు అందే అవకాశం లేకుండా పోయింది.

వాటికి ఇలా, విజయవాడ మెట్రోకు అలా...
ఢిల్లీ 118 కిలోమీటర్లు, చెన్నై 115 కిలోమీటర్లు, బెంగళూరు 12.8 కిలోమీటర్లు అహ్మదాబాద్ 6.3 కిలోమీటర్లు, నాగపూర్ 11.7 కిలోమీటర్లు, నోయిడా 297 కిలోమీటర్ల చొప్పున మొత్తం అదనంగా 19 0 కిలోమీటర్ల కారిడార్ నిడివి పెంచేందుకు 15 వేల కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది. ఇందులో కూడా విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రస్తావన లేదు. దీంతో విజయవాడ మెట్రో రైలు కలగానే మిగిలే పరిస్థితి ఏర్పడింది.












Click it and Unblock the Notifications