తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై తేల్చేసిన కేంద్రం - 2024 ఎన్నికల్లో..!!
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగేది ఎప్పుడు. వచ్చే ఎన్నికల నుంచే కొత్త సీట్లు పెరగనున్నాయా. దీని పైన కేంద్రం తాజాగా క్లారిటీ ఇచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ సీట్లు ఎప్పుడు పెరుగుతాయనే దాని పైన గతంలో చెప్పిన విధంగానే మరోసారి సమాధానమిచ్చింది. 2014 లో జరిగిన ఏపి రాష్ట్ర విభజన సమయంలో...అమోదించిన పునర్విభజన చట్టం మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచాల్సి ఉంది.

చట్ట సవరణ అవసరం
ఈ చట్టం ప్రకారం తెలంగాణలో ఉన్న 17 లోక్ సభ స్థానాల్లోనూ ఒక్కో నియోజకవర్గానికి రెండు చొప్పున మత్తం 34 సీట్లు పెరగాల్సి ఉంది. దీని ద్వారా ప్రస్తుతం తెలంగాణలో ఉన్న 119 స్థానాల సంఖ్య 153కి పెరగాల్సి ఉంది. అదే విధంగా.. ఏపీలో 175 స్థానాల సంఖ్య 225కి పెరగాలి. కానీ, ఇప్పటికే ఈ చట్టం ఆమోదించి ఎనిమిదేళ్లు పూర్తయినా, ఇప్పటి వరకు అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు ఊసే లేదు. దీని పైన ఇప్పుడు మరోసారి రాజ్యసభలో ఈ అంశం చర్చకు వచ్చింది. దీని పైన బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. దీనికి స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రెండు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు 2026 జనాభా లెక్కల తరువాతనే ఉంటుందని తేల్చి చెప్పారు.

2026 తరువాత ఎన్నికల్లో కొత్త సంఖ్య
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్ 26 (1) రాజ్యాంగంలోని ఆర్టికల్ 170లో ఉన్న నిబంధనలకు లోబడి పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 15 మేరకు ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ రాష్ట్రాలలో 175 మరియు 119 నుండి 225 మరియు 153కి వరుసగా పెరుగుతాయని సమాధానం ఇచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం, 2026 సంవత్సరం తర్వాత మొదటి జనాభా గణనను ప్రచురించే వరకు ఏ రాష్ట్ర అసెంబ్లీలో సీట్ల సంఖ్యను సర్దుబాటు చేయటానికి అవకాశం లేదని మంత్రి స్పష్టం చేసారు.

ఈ సారి పాత సీట్లకే పోటీ - ఎంపిక కసరత్తు
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్ 26కు అనుగుణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ని సవరించే వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను పెంచలేమని కేంద్ర మంత్రి తేల్చి చెప్పారు. దీంతో...వచ్చే ఏడాది తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో, అదే విధంగా 2024 లో ఏపీలో జరిగే ఎన్నికల్లోనూ ప్రస్తుత అసెంబ్లీ స్థానాలకే ఎన్నికలు జరగట్ ఖాయంగా కనిపిస్తోంది. రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు రెండు..ఇప్పటికిప్పుడు అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగే అవకాశం లేకపోవటంతో ఇప్పుడున్న స్థానాల మేరకే సర్వేలు..అభ్యర్ధులు..సీట్లు కేటాయింపుల పైన ఇప్పటికే కసరత్తు ప్రారంభించాయి.












Click it and Unblock the Notifications