పోలవరం టెండర్ల రద్దు బాధాకరం .. టెండర్ల రద్దు ఎఫెక్ట్ ప్రాజెక్ట్ నిర్మాణంపై పడుతుందన్న కేంద్రమంత్రి
నవ్యాంధ్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జల శక్తి వనరుల మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు . పోలవరం ప్రాజెక్ట్ టెండర్ల రద్దు ఎఫెక్ట్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై పడుతుందని లోక్ సభ వేదికగా ఆయన పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయం పోలవరం ప్రాజెక్టుకు కొత్త అవరోధం అని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అభిప్రాయపడ్డారు.
Recommended Video


లోక్సభలో పోలవరం ప్రాజెక్ట్ పై చర్చ ... ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి షెకావత్
ఏపీలో గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కుదుర్చుకున్న టెండర్లను రద్దు చేసింది వైసీపీ సర్కార్ . ప్రభుత్వ నిర్ణయంతో పోలవరం ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పనులను దక్కించుకున్న నవయుగ సంస్థ, బెకం సంస్థ టెండర్లను రద్దుచేస్తూ నోటీసులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో వేల కోట్ల అవినీతి జరిగిందని, అందుకే రివర్స్ టెండరింగ్ కు వెళ్లనున్నామని పేర్కొంది వైసిపి ప్రభుత్వం. అయితే ఈ విషయంలో టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 70 శాతం పనులు పూర్తయ్యాయని 30 శాతం పనులు పూర్తి చేసినట్లయితే నవ్యాంధ్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు సాగునీరు, తాగునీటి సమస్యలను పరిష్కరిస్తుందని వారి వాదన. కానీ ప్రభుత్వ నిర్ణయంతో అది సాధ్యమయ్యేలా లేదని , వైసిపి ప్రభుత్వం కావాలని కక్షపూరితంగా వ్యవహరిస్తోందని టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోక్ సభలో కూడా పోలవరం ప్రాజెక్ట్ వ్యవహారం చర్చకు వచ్చింది.

టెండర్ల రద్దుతో నిర్మాణ వ్యయం, సమయం రెండు పెరిగే అవకాశముందన్న కేంద్ర మంత్రి
పోలవరం ప్రాజెక్ట్ పై కమ్ముకున్న నీలినీడల నేపధ్యంలో పోలవరం టెండర్ల రద్దు అంశం లోక్ సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లేవనెత్తారు. పోలవరం అంశం పై మాట్లాడిన మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పోలవరం ప్రాజెక్టు టెండర్ల రద్దు అత్యంత బాధాకరమైన విషయంగా పేర్కొన్నారు . టెండర్ల రద్దుతో నిర్మాణ వ్యయం, సమయం రెండు పెరిగే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణానికి ఇంకా ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొందని జల శక్తి వనరుల మంత్రి షెకావత్ అభిప్రాయపడ్డారు.

ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై కేంద్రం అసంతృప్తి .. కేంద్రానికి మరో సాకు దొరికిందా ?
పోలవరం ప్రాజెక్టులో నామినేషన్ ప్రాతిపదికపై నవయుగ, బెకం సంస్థలు నిర్వహిస్తున్నటెండర్లను రద్దు చేసేందుకు రాష్ట్ర జలవనరులశాఖ ఆ రెండు సంస్థలకు నోటీసులు ఇచ్చింది. నామినేషన్ ప్రాతిపదికపై పనులు అప్పగించడం సరైనది కాదన్న కారణంతోనే వారిని ప్రస్తుతం పనుల నుంచి తొలగిస్తున్నట్లు పోలవరం ప్రాజెక్టు అధికారులు వివరించారు. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు పై నిపుణుల కమిటీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కాంట్రాక్టర్లకు అనవసరపు చెల్లింపులు చేశారని, పనుల్లో బాగా జాప్యం జరుగుతుందని రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని సూచనలు చేసిన నేపథ్యంలో కొత్తగా టెండర్లు పిలిచి ప్రాజెక్ట్ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. కానీ పోలవరం రీ టెండర్ల వల్ల ప్రాజెక్ట్ ఖర్చు కచ్చితంగా పెరుగుతుందని... పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని బాంబు పేల్చారు షెకావత్.
తాజాగా ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం కేంద్రానికి ఒక సాకు కాబోతుంది అనేది కేంద్రమంత్రి వ్యాఖ్యలతో అర్ధం అవుతుంది.












Click it and Unblock the Notifications