రిషికేశ్వరి: వైసీపీ ప్రశ్నలతో వీసీ ఉక్కిరి, ప్యాకేజీ అని.. రోజాపై అనురాధ
గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న రిషికేశ్వరి ఘటనపై ఎట్టకేలకు యూనివర్సిటీ అధికారులు స్పందించారు. వైసీపీ ఎమ్మెల్యేలు వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్లను ఘటనపై నిలదీశారు.
ఈ కేసులో ప్రత్యక్ష ప్రమేయముందని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్క్ కళాశాల ప్రిన్పిపాల్ బాబూరావుపై ఎందుకు చర్యలు తీసుకోలేదని వారు వీసీని నిలదీశారు. వైసీపీ ఎమ్మెల్యేల ప్రశ్నల వర్షంతో నీళ్లు నమిలిన వీసీ, వెనువెంటనే దీనిపై తగిన విధంగా స్పందించాలని రిజిస్ట్రార్ కు ఆదేశాలు జారీ చేశారు.
వీసీ ఆదేశాలతో రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్ బాబూరావుపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు సూచించారు.
సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరపాలి
రిషికేశ్వరి మృతి పైన సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయం వీసీకి తాము ఇదే విషయం చెప్పామన్నారు. వర్సిటీలో శాంతియుత వాతావరణం ఉండేలా చూడాలని కోరినట్లు చెప్పారు. అంతకుముందు నాగార్జున విశ్వవిద్యలయం గేటు వద్ద వారు ఆందోళనకు దిగారు.
జగన్ పార్టీ శవ రాజకీయాలు: అనురాధ
రాష్ట్ర అభివృద్ధిలో నిర్మాణాత్మక పాత్ర పోషించకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శవ రాజకీయాలు చేస్తోందని తెలుగుదేశం పార్టీ నాయకురాలు అనురాధ వేరుగా విమర్శించారు. హైదరాబాదులో మాట్లాడారు. వైయస్ రాజశేఖర రెడ్డి శవాన్ని అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి కావాలని జగన్ అనుకున్నారన్నారు.
పుష్కరాల్లో తొలిరోజు జరిగిన తొక్కిసలాట, ఏఎన్యూలో విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య ఘటనను కూడా రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారన్నారు. ఇలా ప్రతి విషయంలో జగన్ పార్టీ శవ రాజకీయాలు చేస్తోందన్నారు.
రోజా ఒక ప్యాకేజీ ఎమ్మెల్యే అని, కులాల పేరుతో విమర్శించడం ఆమె అలవాటుగా మారిందన్నారు. రిషికేశ్వరి కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్ని రకాలుగా ఆదుకుంటున్నారన్నారు. నిందితులకు కఠినశిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఏపీ, తెలంగాణకు చెందిన నేతలు కొందరు రిషికేశ్వరి తల్లిదండ్రులకు ఫోన్ చేసి రమ్మంటున్నారని, బాబు పైన నమ్మకంతో వారు వెళ్లడం లేదన్నారు.