వ్యాక్సిన్ గణేశ : కరోనా సమయంలో వ్యాక్సిన్ పై అవగాహనం కోసం .. ఎక్కడెక్కడ అంటే !!
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్న సమయంలో జరుగుతున్న వినాయక చవితి నవరాత్రి వేడుకలలో విభిన్న రూపాలలో గణనాథులు కొలువుదీరారు. భారతదేశంలో కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు ఏ పండుగలను సరిగా నిర్వహించుకోలేని పరిస్థితి నెలకొంది. గతేడాది కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్ణయించుకోలేదు. బహిరంగ మండపాలు పెట్టి గణేష్ నవరాత్రి వేడుకలు నిర్వహించుకోలేని పరిస్థితి హిందువులను ఆవేదనకు గురి చేసింది. ఇక ఈ ఏడాది కూడా కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉండటంతో వినాయక చవితి వేడుకలపై నీలినీడలు అలముకున్నాయి. చాలా రాష్ట్రాలలో ఆంక్షలు విధించినా, కరోనా నిబంధనలను పాటిస్తూ వినాయక చవితి వేడుకలు నిర్వహించడానికి నిర్ణయించి పెద్ద ఎత్తున మండపాలను ఏర్పాటు చేశారు.
వినాయకచవితి వేడుకల రగడ .. వినాయకుడి విగ్రహానికి నల్ల రిబ్బన్ కట్టి విశాఖలో హిందూ సంఘాల మౌన దీక్ష
కరోనా వ్యాక్సిన్ పై అవగాహన కోసం వ్యాక్సిన్ గణేశ
ఇక ఇదే సమయంలో కరోనా వ్యాక్సిన్ పై అవగాహన తీసుకురావడం కోసం దేశవ్యాప్తంగా పలుచోట్ల వ్యాక్సిన్ గణనాథులు సందడి చేస్తున్నారు. ప్రజలలో కరోనా మహమ్మారి పట్ల చైతన్యం తీసుకురావడం కోసం, కరోనా మహమ్మారి నియంత్రణ కోసం వ్యాక్సిన్ బాటిల్స్ లో గణనాథుల విగ్రహాలను, వ్యాక్సిన్ బాటిల్ పై కూర్చున్న గణనాథుల విగ్రహాలను ఏర్పాటు చేసి కరోనా నియంత్రణకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఈ గణనాథులు ఆసక్తికరంగా ఉండడమే కాకుండా, ఆలోచింప చేస్తున్నారు.
విశాఖలో వ్యాక్సిన్ బాటిల్ లో వినాయకుడు
వినాయక చవితి నవరాత్రి వేడుకల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో మండపాల్లో విభిన్న రూపాలలో గణనాథులు కొలువుదీరారు. నిన్నటి నుండి పలు రూపాల్లో వినాయకుడు పూజలందుకుంటున్నాడు . ఇక ఆంధ్ర ప్రదేశ్ పరిపాలన రాజధాని అయిన విశాఖలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ వినాయక విగ్రహం స్థానికంగా చర్చనీయాంశమైంది. విశాఖపట్నం తాటి చెట్ల పాలెంలో కోవిడ్ వ్యాక్సిన్ కాన్సెప్టుతో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వినాయక మండపం నిర్వహణ సమితి భారీ వ్యాక్సిన్ బాటిల్ ను తయారు చేసి, అందులో గణనాథుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రజలలో కరోనా వ్యాక్సిన్ పట్ల అవగాహన తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.
వ్యాక్సిన్ వినాయకుడితో అవగాహన మాత్రమే కాదు..వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా
వ్యాక్సిన్ బాటిల్ లో వినాయకుడు, వ్యాక్సిన్ వేసే సిరంజీ వద్ద మూషికం ఉండేలా సెట్టింగ్ చేసి మరి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు వ్యాక్సిన్ వినాయకుడితో అవగాహన కలిగిస్తూనే, మరోవైపు అక్కడే ఆరోగ్య సిబ్బంది సహకారంతో వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా నిర్వహిస్తున్నారు. అంతేకాదు వాక్సినేషన్ పట్ల ఉన్న అపోహలను దూరం చేయడం కోసం ప్రజలు వ్యాక్సిన్లు తీసుకునేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మొదటి డోస్ తీసుకున్న వాళ్ళు, ఎంత కాలం తర్వాత రెండో డోస్ తీసుకోవాలి అనేది స్పష్టంగా అర్థమయ్యేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఒకపక్క వినాయక చవితి వేడుకలను కరోనా నిబంధనలతో నిర్వహిస్తూనే, మరోపక్క వ్యాక్సిన్ వినాయకుడి ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు .
కరోనా వ్యాక్సిన్ థీమ్ తో హరిద్వార్ లో బుజ్జి గణపతి మండపం
ఇదిలా ఉంటే పర్యావరణ పరిరక్షణ ధ్యేయంతో, ఎకో ఫ్రెండ్లీ వినాయక చవితి జరుపుకోవాలన్న సందేశంతో పాటు వ్యాక్సినేషన్ పై అవగాహన కలిగించడం కోసం దేశ వ్యాప్తంగా అనేక చోట్ల అనేక రకాలుగా గణేశుని విగ్రహాలను ఏర్పాటు చేశారు. హరిద్వార్ లో మహామాయ గణపతి సంస్థ ఈ ఏడాది కరోనా వ్యాక్సిన్ థీమ్ ను ఎంచుకొని వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది. వారు వ్యాక్సిన్ బాటిల్లో కొలువుదీరిన ఎలుక పై స్వారీ చేస్తున్న బుజ్జి గణపతి కరోనా వ్యాక్సిన్ ను తీసుకు వెళుతున్నట్లుగా విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నారు. ఒడిలో వ్యాక్సిన్ సిరంజీతో ఉన్న బుజ్జి గణనాథుడి ద్వారా కరోనా వ్యాక్సిన్ ఎంత అవసరమో అందరికీ తెలియజేస్తున్నారు.
వ్యాక్సిన్ బాటిల్, సిరెంజీతో గణేశ, ఓ బేకరీలో వ్యాక్సిన్ బాటిల్ పై చాక్లెట్ గణేశ
ఈసారి కరోనాథర్డ్ వేవ్ తో చిన్నారులకు ప్రమాదముందని చెప్తున్న నేపథ్యంలో బాల వినాయకుడు కరోనా వ్యాక్సిన్ తో పాటు వ్యాక్సిన్ ఇచ్చే సిరెంజ్ రెండు వైపులా పెట్టుకుని దర్శనమిస్తున్నాడు. ఈ విగ్రహం సాధారణ ప్రజలు టీకా షాట్లను తీసుకోవడం యొక్క ప్రాముఖ్యతను గ్రహించే విధంగా ఏర్పాటు చేయబడింది. ఇదిలా ఉంటే ఇండోర్ లో ఎకో ఫ్రెండ్లీ గణేష్ చతుర్థి నిర్వహించే ఓ బేకరీ చాక్లెట్లతో గణనాథుని విగ్రహాన్ని తయారుచేసి, ఆ విగ్రహం వ్యాక్సిన్ బాటిల్ పై కూర్చుని వున్నట్లుగా ఏర్పాట్లు చేశారు. ప్రజలలో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం, కరోనా వ్యాక్సిన్ పై అవగాహన కలిగించడం కోసం ఈ విధంగా తమ బేకరీలో వ్యాక్సిన్ పై గణనాథుని విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లుగా వారు చెబుతున్నారు. అంతేకాదు వ్యాక్సిన్ ఫస్ట్, సెకండ్ డోస్ లను తీసుకోవడంతో పాటు, కరోనా పట్ల అవగాహన కలిగి ఉండాలని, అందరూ అప్రమత్తంగా ఉండాలన్న సందేశాన్ని ఈ విగ్రహం ద్వారా ఇస్తున్నారు.
వినాయక మండపాల ద్వారా ప్రజల్లో కరోనాపై, వ్యాక్సినేషన్ పై అవగాహనకు యత్నం
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న వేళ, ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి వినాయక నవరాత్రి వేడుకల ద్వారా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఒకపక్క దేశంలో ఇంకా కరోనా కేసులు నమోదవుతున్న పరిస్థితుల నేపథ్యంలో గణేష్ నవరాత్రులు నిర్వహిస్తే, కరోనా మహమ్మారి ఇంకా విజృంభించే అవకాశం ఉందని అనేక రాష్ట్రాలలో వినాయక చవితి ఉత్సవాల పై ఆంక్షలు విధించిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ వినాయక నవరాత్రి ఉత్సవాలు కొనసాగిస్తున్న అనేక రాష్ట్రాలలో ప్రజలు కరోనాపై అవగాహన కలిగించటానికి వినాయక మండపాలు ఏర్పాటు చేయడం విశేషం.