తిరుమలలో వైకుంఠ ఏకాదశి టికెట్ల విడుదల తేదీలు ఇవే: అవి ఉంటేనే శ్రీవారి దర్శనం..!!
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం నాడు 62,112 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 22,541 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.36 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
25 కంపార్ట్మెంట్లు..
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 25 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లల్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

టీటీడీ విస్తృత ఏర్పాట్లు..
కలియుగ వైకుంఠం తిరుమల.. వైకుంఠ ఏకాదశి పర్వదినం కోసం ముస్తాబవుతోంది. జనవరి 10 నుండి 19వ తేది వరకు శ్రీనివాసుడిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునే భాగ్యం లక్షలాది మంది భక్తులకు కలగబోతోంది. దీనికోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
టోకెన్లు ఉంటేనే..
వైకుంఠ ఏకాదశిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే టీటీడీ కొన్ని నిర్ణయాలను తీసుకున్న విషయం తెలిసిందే. టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. టోకెన్లు లేని భక్తులకు తిరుమలకు వెళ్లొచ్చు గానీ శ్రీవారిని దర్శనం చేసుకునే అవకాశం వారికి లభించదు. చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలు ఈ 10 రోజుల పాటు రద్దవుతాయి.
ఈఓ సమీక్ష..
తాజాగా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఉత్తర/వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈ సమావేశం ఏర్పాటైంది. టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలను తీసుకున్నారు.
టికెట్ల విడుదల తేదీలు ఇవే..
ఈ నెల 23వ తేదీన ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల శ్రీవాణి కోటా టికెట్లు ఆన్లైన్లో విడుదల చేయాలని నిర్ణయించారు. 24న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల ఎస్ఈడీ టికెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తారు.
తిరుపతి, తిరుమల కౌంటర్లల్లోనూ..
జనవరి 10 నుండి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లను సామాన్య భక్తుల కోసం అందుబాటులోకి తీసుకొస్తారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం తిరుపతిలో స్లాటెడ్ సర్వదర్శనం టికెట్లను జారీ చేస్తోన్న ఎనిమిది కేంద్రాల్లో ఎస్ఎస్డీ టోకెన్లను కేటాయిస్తారు. అలాగే- తిరుమలలో ఉన్న ఎస్ఎస్డీ టోకెన్ల జారీ సెంటర్లోనూ వీటిని మంజూరు చేస్తారు.
అదనపు సౌకర్యాలు..
తిరుపతిలో ఎంఆర్ పల్లి, జీవకోన, రామా నాయుడు స్కూల్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో ఈ టోకెన్ల కేంద్రాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. టోకెన్ జారీ కేంద్రాలు వద్ద భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఈఓ శ్యామలరావు ఆదేశాలు జారీ చేశారు.
ప్రొటోకాల్ దర్శనాలు..
టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులు మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతి ఉంటుంది. టోకెన్ లేని భక్తులు తిరుమలకు రావచ్చు గానీ దర్శనం లభించదు. టోకెన్లు లేదా టికెట్లు లేని భక్తులను క్యూ లైన్లలోకి అనుమతించరు. వైకుంఠ ఏకాదశి నాడు తెల్లవారుజామున 4:45 నిమిషాలకు ప్రొటోకాల్ దర్శనాలు ప్రారంభమౌతాయి.
వేదాశీర్వచనాలు రద్దు..
వైకుంఠ ఏకాదశి రోజున వేదాశీర్వచనాలు కూడా రద్దయ్యాయి. ఆ రోజున ఉదయం 9 నుండి 11 గంటలు వరకు స్వామివారు స్వర్ణ రథంపై ఊరేగుతారు. భక్తులను కటాక్షిస్తారు. వైకుంఠ ద్వాదశి రోజున తెల్లవారు జామున 5:30 నుండి 6:30 వరకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు టీటీడీ అధికారులు.
నిరంతరాయంగా అన్న ప్రసాదం..
గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన సదుపాయం ఉండదు. అశేష భక్తజనం కోసం తెల్లవారు జామున 6 నుండి రాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు పంపిణీ చేసేలా ఈఓ శ్యామలరావు ఆదేశాలు ఇచ్చారు. అల్పాహారంగా ఉప్మా, చక్కెర పొంగలి, పొంగలి, టీ, కాఫీ, పాలు అందజేస్తారు.
లడ్డుల కొరత లేకుండా..
లడ్డూ ప్రసాదం కోసం భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ప్రతిరోజూ 3.50 లక్షల లడ్డూలను అదనంగా అందుబాటులో ఉంచుకోవాలని ఈఓ చేప్పారు. దీనికి అదనంగా 3.50 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్గా సిద్ధం చేసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications