వనజాక్షిదే తప్పు!: తేల్చిన ఏపీ కేబినెట్, నిర్ణయాలు ఇవీ...
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ బుధవారం నాలుగు గంటల పాటు కొనసాగింది. ముసునూరు తహసీల్దారు వనజాక్షిది తప్పు అని ఈ కేబినెట్లో తేల్చినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి ఘటన పైన ఏం నిర్ణయం తీసుకున్నారో తెలియాల్సి ఉంది.
కొద్ది రోజుల క్రితం ముసునూరు తహసీల్దారు వనజాక్షి పైన ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఇది వివాదాస్పదమైంది. అయితే, బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో... ఈ ఘటనలో వనజాక్షిది తప్పని తేల్చారని తెలుస్తోంది.
వనజాక్షి సరిహద్దులు దాటి పశ్చిమ గోదావరి జిల్లాలోకి వెళ్లారని నిర్ణయించారని తెలుస్తోంది. ఘటనలో వనజాక్షిది తప్పని నిర్ణయించిన కేబినెట్, చింతమనేని దాడి వ్యవహారంపై ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాజమండ్రిలోని ఆర్ అండ్ బీ అతిథిగృహంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. నాలుగు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. పుష్కరాల తొలిరోజు రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతులకు మంత్రివర్గం సంతాపం తెలిపింది.
గోదావరి పుష్కరాల నిర్వహణ, గృహ నిర్మాణరంగం సహా పలు భూకేటాయింపులపై, అనంతపురం జిల్లాలో జరిగిన నకిలీ పాసు పుస్తకాల కుంభకోణంపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మినహా మిగిలిన మంత్రులంతా సమావేశానికి హాజరయ్యారు. మోకాలికి శస్త్రచికిత్స కారణంగా ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సమావేశానికి హాజరుకాలేకపోయారు.
కేబినెట్ పలు నిర్ణయాలు... కర్నూలు డిఆర్డీవోకు 2వేల ఎకరాల భూమి కేటాయింపుకు ఆమోదం. విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయానికి భూసేకరణపై చర్చ. విశాఖ ఐటీ సెజ్లో ఈ సెంట్రిక్ సొల్యూషన్ సంస్థకు 300 ఎకరాలు కేటాయింపు.
పుష్కరాల అనంతరం ఈ నెల 25వ తేదీన ప్రతి ఇంట్లో దీపారాధన చేయాలని పిలుపు. పుష్కరాల్లో పని చేసిన వారికి రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఈ నెల 26న ప్రశంసా పత్రాలు ఇవ్వాలని నిర్ణయం. వీలైనంత త్వరగా ప్రభుత్వ శాఖలను విజయవాడకు తరలించడం.
కేబినెట్ సబ్ కమిటీ వేసి రెవెన్యూ విధానాన్ని ఏడాదిలోగా మార్చాలని నిర్ణయం. ప్రధాని సూచనల మేరకు కజకిస్తాన్, తుర్కెమనిస్తాన్, ఆస్కాన్, అస్నాబాద్ రాజధానులను మంత్రివర్గం పరిశీలించడం. రాజధాని నిర్మాణానికి స్విస్ ఛాలెంజిలో పాల్గొనాలని చైనా, జపాన్, సింగపూర్, మలేషియాలకు లేఖలు.