క్యాసినోలో జగన్ వాటా ఎంత? వారిని అరెస్ట్ చెయ్యకుంటే జగన్ ఇల్లు ముట్టడే: వంగలపూడి అనిత
సంక్రాంతి పండుగ సందర్భంగా గుడివాడలో క్యాసినో నిర్వహణ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలను వేడెక్కిస్తోంది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. తెలుగుదేశం పార్టీ నేతలు మూకుమ్మడిగా ఏపీ మంత్రి కొడాలి నానిపై, అలాగే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇక తాజాగా టిడిపి పొలిట్ బ్యూరో సభ్యురాలు, తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత గుడివాడ క్యాసినో ఘటనపై జగన్ ను టార్గెట్ చేశారు.
మౌనం దేనికి? కొడాలి నానీని బర్తరఫ్ చెయ్యరేం.. క్యాసినో వ్యవహారంలో సీఎం జగన్ పై టీడీపీనేతల ఒత్తిడి
ఆంధ్రప్రదేశ్ పేరు చెబితే గుడివాడ క్యాసినో గుర్తొస్తుంది
ఆంధ్రప్రదేశ్ పేరు చెబితే మొన్నటివరకు గంజాయి, డ్రగ్స్ గుర్తు వచ్చేవని, ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పేరు చెబితే గుడివాడ, అందులో క్యాసినో కూడా గుర్తొస్తుంది అని వంగలపూడి అనిత పేర్కొన్నారు. అన్ని విధాలుగా ఏపీ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు సూపర్ సీఎం జగన్ అంటూ వంగలపూడి అనిత మండిపడ్డారు. గుడివాడలో క్యాసినో నిర్వహిస్తే కొడాలి నాని గారు కరోనా పేరు చెప్పి తాను హైదరాబాద్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నానని చెబుతున్నారని, మరి ఆరోజు వేసిన క్యాసినో టెంట్ లలో వైసీపీ జెండాల రంగులే ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు.
క్యాసినో పేదలకు అందుబాటులోకి తెస్తారా.. అనిత సెటైర్లు
క్యాసినో నిర్వహించి డాన్సులు వేసిన వారిలో వైసిపి నాయకులు ఉన్నారంటూ తెలిపిన వంగలపూడి అనిత ఇన్ని ఆధారాలు ఉన్నా మంత్రి తనకు సంబంధం లేదని చెబుతున్నారని మండిపడ్డారు. సినిమా టిక్కెట్ల ధర పది రూపాయలు చేశారని, మరి గుడివాడ క్యాసినోకి మాత్రం పది వేల రూపాయల టిక్కెట్లు పెట్టారని వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. దీనిని కూడా పేదలకు అందుబాటులోకి తెస్తారా అంటూ వైసిపి సర్కారును, మంత్రులను వంగలపూడి అనిత ప్రశ్నించారు.
క్యాసినోలో సీఎం జగన్ కు, ఏపీ డీజీపీలకు వాటా ఉంది
సీఎం జగన్ ఉండే తాడేపల్లి కూతవేటు దూరంలో ఇంతా జరుగుతున్నా జగన్ ఎందుకు నోరు విప్పడం లేదని వంగలపూడి అనిత ప్రశ్నించారు. గుడివాడ క్యాసినో వ్యవహారంలో సీఎం జగన్ కు, ఏపీ డీజీపీలకు వాటా ఉందని వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో విశాఖ బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తే జగన్, రోజా లు ఇద్దరూ కలిసి విమర్శలు చేశారని, అసలు ఎలాంటి సంస్కృతి విఘాతం జరుగకున్నా, సీఎం చంద్రబాబు సంస్కృతికి విఘాతం కలిగించే పనులు చేపట్టారని నాడు విమర్శించారని వంగలపూడి అనిత పేర్కొన్నారు. మరి ఇప్పుడు క్యాసినో వ్యవహారంపై సీఎం జగన్ ఎందుకు సమాధానం చెప్పడం లేదని వంగలపూడి అనిత ప్రశ్నించారు.
Recommended Video
కొడాలి నానీని బర్తరఫ్ చెయ్యాలి.. లేదంటే జగన్ ఇంటిని ముట్టడిస్తాం
గుడివాడలో క్యాసినో సూత్రధారి అయిన కొడాలి నానీని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. క్యాసినో పై 10 రోజులైనా, జగన్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? రూ.500 కోట్ల వాటాలు వెళ్ళటంతోనే జగన్ స్పందిచటం లేదా? ఎవరి వాటాలు ఎంతెంత ? అని ప్రశ్నిస్తున్నారు. క్యాసినో చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని, వారిని అరెస్ట్ చేయాలని వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. లేదంటే ఛలో గుడివాడ పేరుతో సమాధానం చెబుతామని,తాడేపల్లి జగన్ ఇంటిని కూడా ముట్టడిస్తామని తేల్చి చెప్పారు. తాడేపల్లి ప్యాలెస్ కి ఎంత వాటా వెళ్ళిందో చెప్పాలన్నారు. డిజీపి కి ఎంత వాటా వెళ్లిందో తేల్చాలని వంగలపూడి అనిత డిమాండ్ చేశారు.