జగన్ బాధపడ్డారు: పద్మ, ఎంతో నేర్పింది: బాబు, రాజధాని ప్లాన్లో మార్పులా?
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యమిత్రలను తొలగించడం అన్యాయమని, నెల్లూరు జిల్లాలో ఉద్యోగిని సుమలత ఆత్మహత్యాయత్నం బాధాకరమని వైయస్సార్ కాంగ్రెస్ పార్ట అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సోమవారం నాడు అన్నారు.
సుమలత ఆత్మహత్య విషయాన్ని తాము తమ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లామని చెప్పారు. ఈ ఘటన పైన జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్లు తెరవాలన్నారు. అంగన్వాడీల విషయంలోను ప్రభుత్వం సరిగా వ్యవహరించడం లేదన్నారు.
కాగా, ఆరోగ్య మిత్ర ఉద్యోగులను తొలగించారన్న మనస్తాపంతో సుమలత ఉదయం ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని తెలుస్తోంది.

రాజధాని మాస్టర్ ప్లాన్లో మార్పులు!
సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ పట్ల రాజధాని ప్రాంతంలోని కొందరు రైతుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. గ్రామ కంఠాల పైన స్పష్టత ఇవ్వాలని, రోడ్ల విషయం తదితరాల పైన కొన్ని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ హుటాహుటిన రెండు రోజుల పాటు సింగపూర్ వెళ్లి వచ్చారు.
సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్తో కలిసి సింగపూర్ వెళ్లారు. సింగపూర్ ప్రతినిధులతో కలిసి మాస్టర్ ప్లాన్లో మార్పుల పైన మంత్రి నారాయణ చర్చించినట్లుగా తెలుస్తోంది. ఎక్స్ప్రెస్ వేలు, అగ్రికల్చరల్ జోన్లను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సొంత గ్రామాల్లో భూములు దక్కని సీడ్ కేపిటల్ గ్రామాల రైతులు కూడా అసంతృప్తితో ఉన్నారు.
'కాపులను బీసీల్లో చేరిస్తే పోరాటం'
కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం హంగు, ఆర్భాటం కలిగిన కాపులను బిసి జాబితాలో చేర్చటం వల్ల ప్రధానంగా స్థానిక సంస్థల్లో బిసిలకు ప్రాతినిధ్యం లేకుండా పోతుందని అందుకే కాపులను బిసి జాబితాలో చేరిస్తే పోరాటం తప్పదంటూ యాదవ మహాసభ జాతీయ నేతలు చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఏపీలో అత్యధికంగా ఉన్న యాదవులు ఐక్యంగా ఉండి రాజ్యాధికారం సాధించాలని, అలాగే యాదవుల హక్కుల కోసం నిరంతరం పోరాడి ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలన్నారు. కాపులు బిసి రిజర్వేషన్లలో పోటీచేస్తే స్థానిక సంస్థల్లో బిసి జాబితాలో ఉన్న 120 కులాలకు స్థానం లేకుండా పోతుందన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ ఆలోచనను విరమించుకోవాలన్నారు.
టెక్నాలజీ జీవితాల్లో భాగం: చంద్రబాబు
మన జీవితాలలో సాంకేతికత ఓ భాగమైందని ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం అన్నారు. దావోస్ సదస్సుకు హాజరుకావడం వల్ల మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలుసుకునే అవకాశం లభించిందని ఆయన చెప్పారు. దావోస్ పర్యటన ముగించుకుని చంద్రబాబు విజయవాడకు చేరుకున్నారు.
తన పర్యటన విశేషాల గురించి సోమవారం మీడియాతో చెప్పారు. ప్రపంచంలో అవలంబిస్తున్న కొత్త కొత్త విధానాలపై చర్చించామన్నారు. జురిచ్ లో 11 కంపెనీల ప్రతినిధులను తాను కలిశానని చెప్పారు. ఈ సదస్సుకు హాజరుకావడం వల్ల ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ఏవిధంగా అందించవచ్చో తెలుసుకోవచ్చన్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో మెరుగైన జీవన ప్రమాణాలు ఎలా కల్పించాలనే దానిపై ఒక ఆలోచన చేస్తున్నామని, ఈ ఆలోచన ద్వారా ప్రజల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టవచ్చని, నూతన సాంకేతికతను ఉపయోగించుకుని ఎలా ముందుకెళ్లాలనే విషయమై ఆలోచిస్తున్నామన్నారు.
పారిశ్రామిక విప్లవం వల్ల లాభనష్టాలు ఎలా ఉంటాయో బేరీజు వేసుకోవ్చని, సాంకేతికయుగంలో నైపుణ్యం, సమర్ధత పెంచుకోగలిగితే తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలు సాధించవచ్చన్నారు. ఆర్థిక వ్యవస్థను ఏవిధంగా మెరుగుపరచుకోవాలనే విషయమై ఆలోచిస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications