బయోఫ్యూయల్ వివాదం...పైప్ లైన్ పగలగొట్టిన గ్రామస్థులు....టిడిపి నేతల అరెస్ట్...విజయనగరం జిల్లా నడి
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం నడిపల్లి గ్రామంలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
విజయనగరం జిల్లా: విజయనగరం జిల్లాలో వేదా బయో ఫ్యూయల్ పరిశ్రమ వివాదం మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం నడిపల్లి గ్రామంలో వేదా బయో ప్యూయల్ పరిశ్రమ యాజమాన్యానికి , గ్రామస్థులకు మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. పరిశ్రమ నుంచి వ్యర్థాలు పోయేందుకు స్థానికుల భూములు గుండా వేసిన పైపులైనును సోమవారం గ్రామస్తులంతా కలిసి పగులగొట్టారు.
తమ భూములు గుండా పైపులైన్ వేస్తే సహించేది లేదని ఈ సందర్భంగా గ్రామస్థులంతా హెచ్చరించారు. పైప్ లైన్ పగుల గొట్టే క్రమంలో ఉద్రిక్తతకు దారితీయండంలో స్థానిక టిడిపి నాయకుడు లంకలపల్లి శ్రీనివాసరావుతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్ట్ లపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ భూముల్లో నుంచి తమ అనుమతి లేకుండా వేసిన పైపులైన్లను ధ్వంసం చేస్తే పోలీసులు మమ్మల్నే అరెస్ట్ చేయడం అన్యాయమని సర్పంచి బొజ్జ ఈశ్వరమ్మతో సహా పలువురు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
తమ ప్రాణాలు పోయినా సరే తమ భూముల్లో నుంచి పైపు లైన్ను వెళ్లనిచ్చేది లేదని, ఒకవేళ పైప్ లైన్ పునరిద్దరించడానికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని గ్రామస్థులు హెచ్చరించారు. గ్రామస్థులు భారీ సంఖ్యలో పైపులైన్ వద్దకు చేరుకున్నారన్న సమాచారం తెలిసి డిఎస్పి ఎవి రమణ ఆధ్వర్యంలో సుమారుగా 50 మంది పోలీసులను పరిశ్రమ వద్ద మోహరించారు. పోలీసుల అండతో మళ్లీ పైపు లైన్ పునర్దురణ చేయాలని ప్రయత్నించి నప్పటికీ గ్రామస్తులు అడ్డుకోవడం ఖాయమని తెలిసి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అయితే ఇరువర్గాలతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని డిఎస్పి ఈ సందర్భంగా తెలిపారు. అయితే పరిశ్రమ యాజమా న్యానికి పోలీసులు, ప్రభుత్వం కొమ్ముకాస్తున్నారంటూ జెడ్పిటిసి సభ్యులు ఆకిరి ప్రసాదరావు ఆరోపించారు.