వైసీపీతో పెట్టుకున్న బాలయ్య- వీరసింహా రెడ్డిలో జగన్ సర్కార్పై పంచ్ డైలాగ్స్
ఒంగోలు: మచ్ అవైటెడ్ మూవీ.. వీరసింహారెడ్డి. ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హీరో. శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. వరలక్ష్మీ శరత్ కుమార్, మలయాళ నటి హనీరోజ్ వర్ఘీస్కీలక పాత్రను పోషించారు. కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ విలన్ గా నటించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకుడు.
తన ఇద్దరు వికలాంగ కూతుళ్లను సుప్రీంకోర్టుకు పిలిపించిన సీజేఐ..!!
గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్..
సుమారు 70 కోట్ల రూపాయల వ్యయంతో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఒంగోలులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకొంటోంది చిత్రం యూనిట్. అదే సమయంలో ట్రైలర్ ను కూడా గ్రాండ్ గా లాంచ్ చేసింది. నందమూరి బాలకృష్ణ, శృతిహాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్, దర్శకుడు గోపీచంద్ మలినేని, చిత్ర నిర్మాతలు సహా ఈ సినిమాలో నటించిన పలువురు నటులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
వెన్యూ ఛేంజ్..
తొలుత ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏడీఎం కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహించాలని నిర్ణయించారు. వాహనాల రాకపోకలకు విఘాతం కలుగుతుందనే కారణంతో ఇక్కడ నిర్వహించడానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనితో వెన్యూను షిఫ్ట్ చేశారు. ఒంగోలు మార్కెట్ యార్డ్ ఎదురుగా ఉన్న అర్జున్ ఇన్ ఫ్రా గ్రౌండ్స్ లో ఏర్పాటు చేశారు.
రాజకీయ రంగు..
ఈ సినిమా ఊహించినట్టే రాజకీయ రంగును పులుముకొంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై పంచ్ డైలాగ్స్ సంధించారు నందమూరి బాలకృష్ణ. సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో గానీ.. ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు.. మార్చలేరు.. అనే డైలాగ్.. జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించిందేనని అంచనాలు ఉన్నాయి.
హెల్త్ యూనివర్శిటీ..
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును ఏపీ ప్రభుత్వం మార్చేసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ పేరును తొలగించి- దాని స్థానంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును పెట్టింది. ఈ విశ్వవిద్యాలయానికి డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ పేరు పెట్టింది. తాజాగా వీరసింహా రెడ్డి మూవీలో బాలకృష్ణ- ఈ విషయాన్నే ప్రస్తావించినట్లు కనిపిస్తోంది. సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో గానీ అనే డైలాగ్- దీన్ని ఉద్దేశించిందేనని చెబుతున్నారు.
ట్రోల్స్ షురూ..
ఈ డైలాగ్ పట్ల వైఎస్ఆర్సీపీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై నందమూరి బాలకృష్ణను ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. అటు టీడీపీ అభిమానులు ఈ డైలాగ్స్ ను హైలైట్ చేస్తూ ట్వీట్లు పోస్ట్ చేస్తోన్నారు. మళ్లీ ఈ రెండు పార్టీల అభిమానులు, సోషల్ మీడియా ప్రతినిధుల మధ్య పోటాపోటీగా మీమ్స్, ట్రోల్స్ సాగడం ఖాయంగా కనిపిస్తోంది.