బలవంతంగా తెలంగాణ రాష్ట్రాన్ని లాక్కున్నారు; టీఆర్ఎస్ మంత్రికి వైసీపీ మంత్రి వెల్లంపల్లి ఘాటు రిప్లై
ప్రస్తుతం ఆర్థికంగా బలంగా ఉన్నామన్న భావన లో ఉన్న తెలంగాణ ఏపీ పై విమర్శలు చేయడం మంచిది కాదని వెల్లంపల్లి శ్రీనివాస్ హితవుపలికారు. తెలంగాణ సొమ్ము దోచుకున్న ఆంధ్రోళ్లు అంతా ఇప్పుడు అడుక్కు తింటున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వేముల ప్రశాంత్ రెడ్డి కి ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి పై, ఏపీ ఆర్థిక పరిస్థితిపై దారుణమైన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డిని ఏపీ మంత్రులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలంగాణ సీఎం కెసిఆర్, తెలంగాణ మంత్రులపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన మంత్రివర్గం ఏపీపై అవాకులు చవాకులు మాట్లాడటం మంచి పద్ధతి కాదని వెల్లంపల్లి శ్రీనివాస్, వారి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బలవంతంగా తెలంగాణ రాష్ట్రాన్ని లాక్కున్నారని ఆయన మండిపడ్డారు.

ఇప్పటికే తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైసిపి మంత్రి పేర్ని నాని, సజ్జల రామకృష్ణారెడ్డి తెలంగాణ టీఆర్ఎస్ నాయకులకు ఘాటుగా రిప్లై ఇచ్చారు. మా రాష్ట్రం గురించి మీకెందుకు అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్ ను వదిలేసి వచ్చామని, పాలకుండ లాంటి హైదరాబాదు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం అప్పులపాలు అయిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ గురించి మేం ఎప్పుడైనా మాట్లాడామా? అంటూ మండిపడ్డారు. అసలు ఏపీ గురించి మీకు దేనికని నిలదీశారు. సీఎం కేసీఆర్ లా తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దల దగ్గరకు వెళ్ళినప్పుడు లోపల కాళ్లు పట్టుకొని, బయట ఇంకోలా నటించడం లేదని రివర్స్ ఎటాక్ చేశారు. నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు.
ఇక ఇదే సమయంలో టిడిపిపై విమర్శలు గుప్పించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ శ్రీశైలం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తే నిధులు మంజూరు చేయడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి సుముఖంగా ఉన్నారని స్పష్టం చేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ఇప్పుడు అధికారం లేని సమయంలో మరోలా మాట్లాడుతున్నారని వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. కుప్పంలో జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి గెలుపు ఖాయమని పేర్కొన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, చంద్రబాబు ఏ రోజూ నిజాలు మాట్లాడరని, ఆయన నిజాలు మాట్లాడితే తల వెయ్యి వక్కలవుతుంది అని వైయస్ రాజశేఖర్ రెడ్డి గతంలో అసెంబ్లీలో చెప్పారని వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications