వెంకయ్య నాయుడి ఎఫెక్ట్: చంద్రబాబు పట్ల కెసిఆర్ సాఫ్ట్?
హైదరాబాద్: చీటికి మాటికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వైఖరి మారినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తొలిసారి శుక్రవారం తెలంగాణలో పర్యటించారు. తెలంగాణ పోరాట గడ్డ వరంగల్ బహిరంగ సభలో సుదీర్ఘంగా ప్రసంగించారు. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించుకోవడానికి చర్చలకు రావాలంటే, రావడం లేదని ఆయన కెసిఆర్ను తప్పు పట్టారు. అయినా, చంద్రబాబుపై విమర్శలు వెల్లువెత్తకపోవడం ఆశ్చర్యంగానే కనిపిస్తోంది.
తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్రధాన నాయకులు గానీ, తెలంగాణ మంత్రులు గానీ చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించడం లేదు. చంద్రబాబుపై ఏ విధమైన వ్యాఖ్యలు చేయవద్దనే ఆదేశాలు కెసిఆర్ నుంచి వెళ్లడం వల్లనే ఎవరూ నోరు మెదపడం లేదని అంటున్నారు. ఇది కెసిఆర్ రాజకీయంలో వచ్చిన మార్పు కారణంగానే అంటున్నారు. చంద్రబాబు పట్ల మెతక మైఖరి అవలంబించాలనే ఉద్దేశంతో కెసిఆర్ ఉండడం వల్లనే చంద్రబాబు మాటలను, పర్యటనను టిఆర్ఎస్ చూస్తూ మిన్నకుందని అంటున్నారు.
కెసిఆర్ ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాతనే వైఖరి మారిందనే మాట కూడా వినిపిస్తోంది. గతంలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీకి కెసిఆర్కు సమయం ఇవ్వలేదు. చంద్రబాబు ఓ వైపు ప్రధాని మోడీని, కేంద్ర మంత్రులను ఒకటికి రెండు సార్లు ఢిల్లీ వెళ్లి వస్తుంటే కెసిఆర్కు మాత్రం అటువంటి అవకాశం రాలేదని అంటున్నారు మోడీ అసంతృప్తితో ఉండడం వల్లనే కెసిఆర్తో భేటీకి ఇష్టపడలేదని అంటున్నారు. కానీ ఇటీవలి పర్యటనలో ఆయన మోడీనే కాకుండా పలువురు కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన వాటిని వారి ముందు పెట్టగలిగారు.

చివరగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడితో కూడా సమావేశమయ్యారు. వెంకయ్య నాయుడి ఇంట్లో విందుకు ఆయన హాజరయ్యారు. ఈ సమయంలోనే చంద్రబాబుతో సంబంధాలపై వారిరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇరు రాష్ట్రాలు సఖ్యతతో మెలగాలని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కారం చేసుకోవాలని వెంకయ్య నాయుడు చాలా కాలంగా చెబుతూ వస్తున్నారు. నిజానికి, తెలంగాణ, ఆంద్రప్రదేశ్ వివాదాల్లో ఏ వైపూ తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఈ వివాదాలు ఆయనను కాస్తా ఇబ్బందికి కూడా గురి చేసినట్లు భావించవచ్చు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుతో సఖ్యత మెలగాల్సిన అవసరం గురించి ఆయన కెసిఆర్కు చెప్పినట్లు తెలుస్తోంది. ఆ కారణంగానే కెసిఆర్ చంద్రబాబు పట్ల మెతక వైఖరి అవలంబించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
కెసిఆర్ చంద్రబాబు పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నారని చెప్పడానికి మరో పరిణామం కూడా చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా చంద్రబాబుకు వ్యతిరేకంగా నమస్తే తెలంగాణ పత్రికలో వార్తాకథనాలు వెలువడుతూ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాజధానికి భూసేకరణ విషయంలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందనేంత వరకు ఆ పత్రిక కథనాలు వెళ్లాయి. కానీ, అకస్మాత్తుగా ఆ పత్రికలో చంద్రబాబు వ్యతిరేక కథనాలు ఆగిపోయాయి.
చంద్రబాబుకు సంబంధించిన అనుకూల, వ్యతిరేక వార్తలేవీ ప్రచురించకూడదని నమస్తే తెలంగాణ జర్నలిస్టులకు మౌఖిక ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. దాంతోనే వాటిని ఆపేసినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అందుకు అనుగుణంగానే చంద్రబాబు వరంగల్ సభకు సంబంధించిన వార్తులు ప్రదాన ఎడిషన్లో రాలేదు. పైగా, బహుశా, ఇటీవలి కాలంలో మంత్రి, కెసిఆర్ తనయుడు కెటి రామారావు చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు ప్రచురణకు నోచుకులేదు. చంద్రబాబు వరంగల్ పర్యటనపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా, పార్లమెంటు సభ్యురాలు, కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత గురువారంనాడు ఆదిలాబాద్లో చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు వార్తలో లేవు. సభ్యత్వ నమోదుకు సంబంధించిన వార్తతో సరిపెట్టారు. మొత్తం మీద, ఇరు చంద్రుల మధ్య సామరస్యవూర్వక వాతావరణం చోటు చేసుకుంటోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.












Click it and Unblock the Notifications