చంద్రబాబుపై వ్యాఖ్యలు: సీఎం ఓకే చెప్పారని.. జగన్ను బలపర్చిన వెంకయ్య!
విశాఖ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంగీకరించిన తర్వాతనే కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ వైపు మొగ్గు చూపుతోందని గతంలో, బాబు ఒప్పుకున్నాకే హోదాను కేంద్రం పక్కన పెట్టిందని ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. తాజాగా, ఇదే విషయాన్ని బలపరిచినట్లుగా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు ఉన్నాయ.
విశాఖ వచ్చిన వెంకయ్య బుధవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడిన తర్వాతనే ఏపీకి సాయం ఓకే చేశామని ఆయన వ్యాఖ్యానించారు. హోదా వస్తే పరిశ్రమలు వస్తాయన్న వాదనలో వాస్తవం లేదని ఆయన చెప్పారు.
హోదాకు పారిశ్రామిక రాయితీలకు సంబంధం లేదని చెప్పారు. ఆయన ఈ వ్యాఖ్యలు బీజేపీ కార్యకర్తల సమావేశంలో చెప్పారని తెలుస్తోంది. చంద్రబాబుతో మాట్లాడిన తర్వాతనే ప్యాకేజీని ఓకే చేశామని చెప్పారు.
కాగా, ప్రత్యేక హోదా వస్తే కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10 శాతం ఖర్చులు భరిస్తుందని, ఇప్పుడు హోదా ఇవ్వకపోవడంతో విదేశీ రుణం ద్వారా రాష్ట్రానికి అయ్యే 30 శాతం అదనపు ఖర్చు ను కేంద్రమే భరిస్తుందన్నారు. ఇన్ని ఇచ్చాక హోదా పేరిట విపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయన్నారు. రైల్వే జోన్ ఏర్పాటు పైన కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.