నా జీవితంలో ఎన్నికల్లో పోటీ చేయను: వెంకయ్య
గుంటూరు: తాను జీవితంలో ఇక ఎన్నికల్లో పోటీ చేయబోనని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. తనతోపాటు తన కుటుంబ సభ్యులు కూడా పోటీ చేయరని చెప్పారు. ఉప రాష్ట్రపతిగా వెంకయ్యను ఎంపికచేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
శుక్రవారమిక్కడ జరిగిన చిగురుపాటి నాగేశ్వరరావు వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. తన వెనుక గాంధీ, నెహ్రూ కుటుంబాలు లేవని, చిన్నప్పటి నుంచి కష్టించి క్రమశిక్షణతో పనిచేసి ఈస్థాయికి ఎదిగానని చెప్పారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో సీటు వదిలి వెళ్లేవాడిని కాదని గుర్తు చేసుకున్నారు.

ప్రస్తుత రాజకీయాలు భిన్నంగా ఉన్నాయని, కొందరు ఎంపీలు లోక్సభకు విహార యాత్రలా వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఆయన నిద్రపోరు...నన్ను నిద్రపోనివ్వరూ'' అంటూ ప్రధాని నరేంద్ర మోడీ పనితీరుపై చలోక్తులు విసిరారు. అయితే, ఇతర పార్టీలు మాత్రం ‘ఆయన తినరు. (డబ్బులు) మమ్మల్ని తిననివ్వ'రని వాపోతుంటాయని అన్నారు.
కాగా, భూసేకరణ చట్టంపై వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. దేశాభివృద్ధిని అడ్డుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. శుక్రవారం నాడు గుంటూరులో నిర్వహించిన బీజేపీ అర్బన్ కార్యకర్తల సమావేశానికి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.












Click it and Unblock the Notifications