రాజా, మహరాజా రోజులు కావు: కెసిఆర్పై విహెచ్
తెలంగాణ గడ్డపై ఉండాలంటే మాకు సెల్యూట్ కొట్టాలంటూ మీడియాకు కేసీఆర్ హెచ్చరిక చేయడంపై వీహెచ్ గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో స్పందించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ భాష, తీరు ఏమాత్రం మారలేదన్నారు. మీడియానే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిందని, పత్రికలు, చానళ్లు లేకపోతే తెలంగాణ వచ్చేదా? అని ఆయన అన్నారు.
కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి ఇవేమీ రాజా, మహారాజా రోజులు కావని ఆయన అన్నారు. ''అయినా, నీకు ఎందుకు సెల్యూట్ కొట్టాలిరా బాబూ! అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ నిజాం కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నాడని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యమా లేక దొరల రాజ్యమా అని ఆయన కేసీఆర్ను ప్రశ్నించారు.
కాళోజీ బ్రతికుంటే కేసీఆర్ను చూసి బాధపడేవాడని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఇప్పటికైనా తన తప్పును తెలుసుకుని టీవీ9, ఏబీఎన్ ఛానెళ్ల ప్రసారాలను పునరుద్ధరించాలని వీహెచ్ హితవు పలికారు.