కెసిఆర్కు ప్రజలపై ప్రేమ ఉంటే...: హామీపై విహెచ్
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని కాంగ్రెస్లో విలీనం చేస్తానన్న మాటలను కె. చంద్రశేఖర రావు నిలబెట్టుకోవాలని కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలపై కెసిఆర్కు ఏమాత్రం ప్రేమ ఉన్నా తక్షణం ఆ పని చేయాలని సూచించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను గత కొద్ది రోజులుగా జాతీయ స్థాయి నాయకులందరినీ కలుస్తూ తెలంగాణకు మద్దతు కూడగడుతున్నానని చెప్పారు.
తెలంగాణ ఏర్పాటులో జాప్యం జరగతుండడాన్ని ఒక నాయకుడు తనతో ప్రస్తావిస్తూ - కెసిఆర్ తెరాసను కాంగ్రెస్లో విలీనం కాకపోవటమే కారణమా? అని ప్రశ్నించారని చెప్పారు. ఇలాగే చాలామంది తెరాస కాంగ్రెస్లో విలీనం కాకపోవటమే తెలంగాణ ఆలస్యం అవటానికి కారణమని భావిస్తున్నారని చెప్పారు.
అసెంబ్లీలోకి తెలంగాణ బిల్లు వచ్చిన తర్వాత కూడా కెసిఆర్కు ఏమైనా అనుమానాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. కెసిఆర్ తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తే తెలంగాణ వారు మాటపై నిలబడేవారని తాము కూడా సోనియాకు చెబుతామన్నారు. కెసిఆర్ కూడా కలిస్తే తెలంగాణ ఏర్పాటు సులువు అవుతుందని, అంతే తప్ప తామేమీ తెరాసకు భయపడటం లేదన్నారు.
ఇద్దరు ఎంపీల్లో ఇప్పటికే ఒక ఎంపీ పార్టీ నుంచి వెళ్లిపోయారని, అలాంటి తెరాస వల్ల ఏమీ కాదని విహెచ్ అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు, విభజనను అడ్డుకునేందుకు సీమాంధ్రలోని ప్రజాప్రతినిధులంతా పార్టీలకు అతీతంగా ఏకం అవుతున్నారని గుర్తు చేస్తూ.. తెలంగాణ వారు కూడా ఎందుకు ఏకం కాకూడదని ప్రశ్నించారు.