వెళ్లిపోమన్న చింతల, అందరిముందు వెక్కివెక్కి ఏడ్చిన పీజేఆర్ కూతురు
హైదరాబాద్: దివంగత పీ జనార్ధన్ రెడ్డి (పీజేఆర్) తనయ విజయా రెడ్డి సోమవారం నాడు కంటతడి పెట్టారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఖైరతాబాద్ శాసన సభ్యుడు చింతల రామచంద్రా రెడ్డి ఆమెను వేదిక పై నుంచి దిగిపోవాలని సూచించారు. దీంతో ఆమె కంటతడి పెట్టారు.
పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమానికి హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, విజయా రెడ్డి తదితరులు వచ్చారు.
విజయా రెడ్డి వేదిక పైకి వచ్చారు. ఆమె ఏ హోదాతో వేదిక పైకి వచ్చారని చింతల ప్రశ్నించారు. వేదిక దిగిపోవాలని సూచించారు. దీంతో విజయా రెడ్డి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆమె అందరి ఎదుటే వెక్కి వెక్కి ఏడ్చారు.
అయితే, ఇదంతా నాయిని నర్సింహా రెడ్డి సమక్షంలోనే జరిగింది. నాయిని చింతల రామచంద్రా రెడ్డిని వారించారు. విజయా రెడ్డిని ఓదార్చే ప్రయత్నం చేశారు. అయితే, విజయా రెడ్డి మాత్రం నాయిని చెప్పినా ఆగకుండా, ఏడుస్తూనే వెళ్లిపోయారు. అక్కడి వారు కొందరు ఆమెను సముదాయించే ప్రయత్నం చేశారు.