గడపగడపలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రశ్నలు-సాయిరెడ్డి ఫైర్-చంద్రబాబు గతాన్ని గుర్తుచేస్తూ..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంది. మరో రెండేళ్లలో ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉంది. ఈ మధ్యే ముందస్తు ఎన్నికల సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. ఈ తరుణంలో వైసీపీ సర్కార్ జనంలోకి వెళ్లేందుకు గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎంచుకుంది. ఇందులో వైసీపీ ఎమ్మెల్యేల్ని జనం ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారాన్ని పలు టీవీ ఛానళ్లు హైలెట్ చేస్తున్నాయి కూడా. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ ఫైర్ అయ్యారు.
గడప గడపలో ప్రశ్నలు
వైసీపీ ప్రభుత్వం చేపట్టిన గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు జనం నుంచి సంక్షేమపథకాలతో పాటు అభివృద్ధి పైనా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. స్ధానికంగా అభివృద్ధి లేమిపై కొందరు ప్రశ్నిస్తుండగా.. తమకు పథకాలు అందడం లేదని మరికొందరు ఫైర్ అవుతన్నారు. ఇందులో వైసీపీ మంత్రులకూ ఈ బాధలు తప్పడం లేదు. అయితే అంతిమంగా ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించేందుకు ఈ కార్యక్రమం ఏదో విధంగా ఉపయోగపడుతుందనే అంచనాలో సీఎం జగన్ కనిపిస్తున్నారు. దీంతో వ్యతిరేకతను పట్టించుకోకుండా జనంలోనే తిరగాలని ఎమ్మెల్యేలకు సూచిస్తున్నారు. నెలనెలా రివ్యూలు పెట్టి వెళ్లని వారికి క్లాసు తీసుకుంటున్నారు.
మీడియాలో జనాగ్రహం హైలెట్
అయితే వైసీపీ చేపట్టిన గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు ఎదురవుతున్న వ్యతిరేకత, ప్రశ్నల్ని మీడియా కూడా అదే స్దాయిలో హైలెట్ చేస్తోంది. అధికారంలో ఉండే వారి గురించి ఏం రాసినా, చూపించినా జనం చూస్తారు కాబట్టి మీడియా కూడా మంత్రులు, ఎమ్మల్యేలను జనం ప్రశ్నిస్తున్న తీరుపై ఫోకస్ పెట్టింది. దీంతో అధికార పార్టీ వైసీపీ నేతలు దీనిపై ఫైర్ అవుతున్నారు. ఇదే క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఎల్లో మీడియాపై విరుచుకుపడ్డారు. అదే సమయంలో ఈ వివాదంలోకి కూడా చంద్రబాబును లాగేశారు.
చంద్రబాబుకు గతాన్ని గుర్తుచేసిన సాయిరెడ్డి
గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలను జనం ప్రశ్నిస్తుంటే మీడియా చూపించాలా అన్నట్లుగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నిస్తూ ఓ ట్వీట్ పెట్టారు. ఇందులో గడప గడపకూ ఎక్కడో ఒకరు ఎమ్మెల్యేను ఏదో అడిగితే పచ్చకుల మీడియా భూతద్దంలో పెట్టి చూపిస్తోందన్నారు. సీఎంగా ఉండగా చంద్రబాబునే జనం నిలదీసేవారన్నారు. ఏమీ చెప్పలేక ఏయ్ తోకలు కత్తిరిస్తా, నోర్ముయ్, ఉద్యోగం పీకేస్తా, 40 ఇయర్స్ ఇండస్ట్రీ, ఎవడ్రా నువ్వు అంటూ దబాయించేవారంటూ చంద్రబాబుకు గతాన్ని గుర్తుచేశారు.