లోకేశ్ ‘పెళ్లాం’ కామెంట్లపై దుమారం.. చంద్రబాబు హోదా గల్లంతు.. రఘురామ పేరిట సాయిరెడ్డిపై దాడి..
''రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిఒక్కరిపైనా కక్షసాధింపులకు దిగుతున్నారు. ఫేస్ బుక్ లో ఒక పోస్టు పెట్టాలన్నా వైసీపీని అడగాలా? చివరికి సొంత పెళ్లానికి వాట్సాప్ మెసేజ్ పంపాలన్నా సీఎం జగన్ పర్మిషన్ తీసుకోవాలా? ఏంటీ పరిస్థితి?'' అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేసిన కామెంట్లపై దుమారం చెలరేగింది. పొలిటికల్ విమర్శల్లో పెళ్లాల ప్రస్తావన ఏంటంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.

బ్రాహ్మణి పేరెత్తకుండా..
శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన లోకేశ్.. అచ్చెన్నాయుడి కుటుంబాన్ని పరామర్శించారు. ఆ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. పెళ్లానికి వాట్సాప్ మెసేజ్ చేయాలన్నా జగన్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైసీపీ విజయసాయి రెడ్డి తీవ్రంగా స్పందించారు. బ్రాహ్మణి పేరెత్తకుండా లోకేశ్ కు పంచ్ విసిరారు.

నువ్వు పర్మిషన్ అడిగావా?
‘‘ఏంటి లోకేశ్.. సొంత పెళ్ళానికి వాట్సాప్ మెసేజ్ పెట్టాలంటే.. జగన్ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తోందన్నావ్. అవునా? నువ్వేమైనా తీసుకుంటున్నావా? ఎందుకయ్యా.. రాజకీయాల్లో లేని మీ ఆవిడను కూడా నీ చేతగాని మాటలతో ఈ గొడవలోకి లాగుతావ్?'' అని ఎంపీ ఫైరయ్యారు. కాగా, లోకేశ్ వ్యాఖ్యలకు ఎంపీ ఇచ్చిన కౌంటర్ పైనా సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. లోకేశ్ యధాలాపంగా పెళ్లాల కామెంట్లు చేస్తే, విజయసాయి ఉద్దేశపూర్వకంగా లకేశ్ భార్యను ప్రస్తావించారని నెటిజన్లు పేర్కొన్నారు.

ముప్పేట దాడి..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తాను వినయవిధేయ రాముణ్ని అంటూనే.. సొంత పార్టీ వైసీపీపై అప్రకటిత పోరాటాన్ని ఉధృతం చేశారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. షోకాజ్ నోటీసుల విషయంలో క్రమశిక్షణ కమిటీ ఉనికినే ప్రశ్నించిన ఆయన.. పార్టీ కార్యదర్శి విజయసాయి రెడ్డిపైనా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రఘురామ విసిరిన మాటల బాణాలతోనే ఇప్పుడు ప్రతిపక్ష నేతలు సైతం సాయిరెడ్డిపై ముప్పేటదాడికి దిగారు. మరోవైపు.. చంద్రబాబు ప్రతిపక్షనేత హోదాపై వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్నాయుడి అరెస్టు, నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంపైనా నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది..

సాయిరెడ్డి పదవిపై..
అందరూ ఊహించిన విధంగానే రఘురామ కృష్ణంరాజు వ్యవహారం ఇప్పుడు ఢిల్లీకి చేరింది. శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసిన వైసీపీ ఎంపీ.. తన సొంత పార్టీ జారీచేసిన షోకాజ్ నోటీసుల చట్టబద్ధతపై వివరాలు అడిగితెల్సుకున్నారు. నోటీసులు జారీ చేసే అధికారం విజయసాయికి లేదనీ ఆయన పేర్కొన్నట్లు సమాచారం. ఇదిలాఉంటే, షోకాజ్ కు సమాధానంగా గురువారం రఘురామ రాసిన లేఖలో.. ప్రాంతీయ పార్టీ వైసీపీకి సాయిరెడ్డి జాతీయ కార్యదర్శిగా ఎలా ఉంటారంటూ తీవ్ర కామెంట్లు చేశారు. వాటినే టీడీపీ నేతలు ఆయుధాలుగా వాడుతున్నారు. ‘‘జాతీయ పార్టీకి రాష్ట్ర కార్యదర్శి ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ.. రాష్ట్ర పార్టీకి మాత్రం జాతీయ కార్యదర్శి కచ్చితంగా ఉండాల్సిందే'' అని అనిత ఎద్దేవా చేశారు.

చంద్రబాబు హోదా గల్లంతు..
టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా వైసీపీ గూటికి చేరుతోన్న వేళ.. చంద్రబాబుకు ప్రతిపక్షనేత హోదాపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది. లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదాలో కేబినెట్ మంత్రి స్థాయి హోదాను చంద్రబాబు పొందుతుండటం తెలిసిందే. అయితే, మొన్నటి రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి పడిన ఓట్ల సంఖ్యను బట్టి నైతికంగా చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదా గల్లంతైందని విజయసాయి అన్నారు. ‘‘నైతికంగా ఆయన ఎల్వోపీ హోదా కోల్పోయారు. అయితే, చంద్రబాబుకు అనైతికం తప్ప మరో విషయం తెలియదన్న సంగతి ప్రజలందరికీ ఎరుకే''అని ఎంపీ ట్వీట్ చేశారు.

ఆదాయం పోయిందని ఏడుపు..
రాష్ట్రంలో ఇసుక దందా విచ్చలవిడిగా సాగుతోందంటూ నారా లోకేశ్ బయటపెట్టిన కొన్ని ఆధారాలపై విజయసాయి స్పందించారు. ‘‘ఒక మాలోకం కళ్లన్నీ ఇసుక మీదే. అప్పట్లో శాండ్ మాఫియా నుంచి నెలనెలా మామూళ్లు అందుకునే వాడు. ఇప్పుడా ఆదాయం పోయిందని ఏడుపు. హైదరాబాద్ లో కూర్చుని ఉచిత సలహాలు ఇవ్వకుండా ఇక్కడి కొచ్చి సమస్యను స్టడీ చేసి మాట్లాడు. ఎక్కడో ఒక ఘటనను చూపి ఇలాగే జరుగుతోందని అంటే ఎలా చిట్టి నాయుడు''అని సవాలు విసిరారు.

ప్రపంచానికే జగన్ ఆదర్శం..
ఇండియా సహా ప్రపంచమంతటా కరోనా విజృంభిస్తున్నవేళ.. వైరస్ కట్టడి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభత్వ చేపట్టిన చర్యలపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ సర్కారు చర్చలపై ఓ ఇంగ్లీష్ సైట్ లో వచ్చిన కథనాన్ని ప్రస్తావిస్తూ.. ప్రపంచ దేశాలకు జగన్ సర్కారు ఆదర్శంగా నిలిచిందని, ఆయనను చూసి చాలా నేర్చుకోవాలంటూ.. బ్రిటన్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ ఆంగ్రూ ఫ్లెమింగ్ వ్యాఖ్యానించారు. కొవిడ్ పరిస్థితిపై ఎంపీ విజయసాయి రెడ్డి స్పందిస్తూ.. సీఎం జగన్ కార్యదీక్ష, ముందు చూపును అందరూ ప్రశంసిస్తున్నారని, ఇప్పటికే 7 లక్షల టెస్టులు పూర్తికాగా, ప్రతి కుటుంబానికి పరీక్షలు జరిపే ఏర్పాట్లు చేశామని, 30 వేల బెడ్లు అందుబాటులోకి ఉన్నాయని, రాబోయే రెండు నెలల్లో అదనంగా మరో 40 వేల బెడ్స్ సిద్ధమవుతాయని విజయసాయి వివరించారు.












Click it and Unblock the Notifications