ఏపీ బాటలో యూపీ, జగన్ ను అనుసరిస్తున్న యోగి : కళ్ళు తెరిచి చూడు బాబు అంటున్న సాయిరెడ్డి
జగన్ తీసుకువచ్చిన పథకాలు దేశానికి ఆదర్శంగా మారుతున్నాయా ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న అనేక పథకాలను, జగన్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను వివిధ రాష్ట్రాలు తమ రాష్ట్రంలోనూ ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తున్నారా ? అంటే అవుననే సమాధానమే వస్తోంది. తాజాగా యూపీ సర్కార్ ఏపీ సర్కార్ ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థను తమ రాష్ట్రంలో ప్రారంభించాలని నిర్ణయించడం అందుకు నిదర్శనంగా నిలుస్తుంది.

ఏపీ గ్రామ సచివాలయ వ్యవస్థపై గతంలో టీడీపీ విమర్శలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. గ్రామ సచివాలయ వ్యవస్థ ను ఏర్పాటు చేసి గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ ప్రభుత్వం అందించే పథకాలను మరింత చేరువ చేయాలని సంకల్పించిన సీఎం జగన్మోహన్ రెడ్డి సచివాలయాల ఏర్పాటు, విలేజ్ వాలంటీర్ల ను నియమించడం వంటి ప్రక్రియ వివాదంగా మారి అప్పట్లో రాజకీయాలను కుదిపేసింది. ప్రతిపక్ష టీడీపీ ప్రధానంగా గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటుపై విమర్శల వర్షం కురిపించింది.

విలేజ్ వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలు అంటూ పెద్ద ఎత్తున దుమారం
గ్రామ సచివాలయ వ్యవస్థలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వారిని వాలంటీర్లుగా తీసుకుంటున్నారని, వారు ప్రజల కోసం కాకుండా పార్టీ కోసం పని చేస్తారని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇక విలేజ్ వాలంటీర్ల ఎంపిక ప్రక్రియ కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే జరుగుతుందని విమర్శించారు. గ్రామ పంచాయతీల పనితీరును మెరుగుపరిస్తే సరిపోయేదని, ప్రత్యేకించి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా లేదని విమర్శించిన పరిస్థితులున్నాయి. అయినప్పటికీ వాటిని లెక్క చేయకుండా సీఎం జగన్ మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

ఎవరినీ లెక్క చెయ్యకుండా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన జగన్
రాష్ట్ర వ్యాప్తంగా ఏక కాలంలో లక్షా ఇరవై మూడు వేల మందికి పైగా గ్రామ వాలంటీర్లను నియమించి తన మార్క్ పాలన చూపించారు సీఎం జగన్. గ్రామ సచివాలయ వ్యవస్థ కరోనా కష్టకాలంలో చేసిన పని దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. కరోనా సమయంలో ఇంటింటికి తిరిగిన వాలంటీర్లు, కరోనా బారిన పడిన వారిని గుర్తించటంలో, వారికి సహాయం అందించడంలో కీలకంగా పని చేశారు. అంతేకాదు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామాలలోని ప్రజలకు నేరుగా ఇళ్లకు వెళ్లి సేవలను అందిస్తున్నారు విలేజ్ వాలంటీర్లు.

ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా సచివాలయ వ్యవస్థ .. ఏపీ బాటలో యూపీ
మొదట పలు విమర్శలను ఎదుర్కొన్న గ్రామ సచివాలయ వ్యవస్థ, ప్రస్తుతం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థను ఉత్తరప్రదేశ్ కూడా తీసుకు రావాలని నిర్ణయం తీసుకొని ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్లుగా ఎంపీ విజయసాయి రెడ్డి తాజాగా ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థను ఇప్పుడు యోగి ప్రభుత్వం కూడా తీసుకురావాలని నిర్ణయించి ఆదేశాలిచ్చింది. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని బిజెపి పాలిత రాష్ట్రమైన యూపీ కూడా అనుసరించబోతుంది అంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

చంద్రబాబు విషం కక్కిన గ్రామ సచివాలయ వ్యవస్థ .. యూపీలో కూడా అన్న సాయిరెడ్డి
ఇదే సమయంలో నాడు సచివాలయ వ్యవస్థ పై నోటికొచ్చినట్లు మాట్లాడిన చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. గ్రామ సచివాలయ వ్యవస్థపై బాబు ఆయన మనుషులు ఎంత విషం కక్కారు. ప్రజలకు పాలన దగ్గర అవుతుంటే అదేదో దుర్మార్గపు చర్య అన్నట్టు శోకాలు పెట్టారని, 20 కోట్ల జనాభా ఉన్న పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కూడా ఇప్పుడు జగన్ గారి సచివాలయ విధానాన్ని ప్రవేశ పెడుతూ ఆదేశాలిచ్చింది అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి ఇప్పటికైనా కళ్లు తెరిచి చూడు బాబు అంటూ చంద్రబాబుకు హితోపదేశం చేశారు.












Click it and Unblock the Notifications