తెలుగు దొంగల పార్టీ టీడీపీ; బాబు కుప్పం టూర్ తుస్సుమంది: సాయిరెడ్డి వ్యంగ్యం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి నిత్యం చంద్రబాబును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో నాకౌట్, పొలిటికల్ మిర్చి పేరుతో తెలుగుదేశం పార్టీపై ఆసక్తికర పోస్టులతో విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియాలో సాయిరెడ్డి తెలుగుదేశం పార్టీపై పెట్టే పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇక తెలుగు దేశం పార్టీ నేతల నుండి కూడా సాయిరెడ్డి పోస్టులకు ఘాటు రిప్లైలు వస్తుంటాయి. అయినా సరే ఏ మాత్రం తగ్గకుండా సాయిరెడ్డి సంచలన ట్వీట్లు చేస్తూనే ఉంటారు.
చంద్రబాబు కుప్పం పర్యటనపై సాయిరెడ్డి సెటైర్లు
తాజాగా చంద్రబాబు కుప్పం పర్యటన పై విమర్శలు గుప్పించిన విజయసాయిరెడ్డి మూడు రోజుల కుప్పం టూర్ తుస్సుమంది. బాబు ఉపన్యాసాలే కానీ, సలహాలిచ్చే అవకాశం ప్రజలకు ఇవ్వకపోవడం, ఏదైనా చెప్పబోతే బయటి నుంచి వచ్చిన నేతలు కసురుకోవడం ప్రధానంగా కనిపించిందని వ్యాఖ్యానించారు. ఎక్కడ చూసినా రోప్ పార్టీ పోలీసులు, సొంత సెక్యూరిటీ మనుషులే ఎక్కువగా కనిపించారు అంటూ చంద్రబాబు కుప్పం పర్యటనను విశ్లేషించారు. బాదుడే బాదుడు అంటూ జనాలను బాది వచ్చాడు చంద్రబాబు అంటూ సెటైర్లు వేశారు విజయ సాయి రెడ్డి.
గంజాయి స్మగ్లింగ్ చేస్తుంది టీడీపీ పెద్దలే
అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలవల్ల, తీసుకువచ్చిన ఇసుక పాలసీ వల్ల ఇసుక దోపిడీ ఆగింది. అక్రమ క్వారీలతో ఖనిజ సంపదను కొల్లగొట్టడాన్ని అడ్డుకుంది ప్రభుత్వం అంటూ పేర్కొన్నారు విజయసాయిరెడ్డి. బాక్సైట్ తవ్వకాలు నిల్చిపోయాయని వెల్లడించారు. దీంతో ఈజీ మనీ కోసం తెలుగు దొంగల పార్టీ గంజాయి స్మగ్లింగును ఆశ్రయించిందని విజయ సాయి రెడ్డి ఆరోపించారు.
గంజాయిపై కోట్లు సంపాదించింది ఆ పార్టీ పెద్దలే అని పేర్కొన్నారు. బరితెగించి స్మగ్లింగుకు పాల్పడతున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ నేతలను టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి రాష్ట్రంలో గంజాయి స్మగ్లింగ్ కు టిడిపి నేతలు పాల్పడుతున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
రైతుల్ని దొంగల్లా చూసిన పార్టీ తెలుగు దొంగల పార్టీ, గాంధీజీకి టీడీపీ జెండాలపై సెటైర్లు
అంతేకాదు గతంలో చంద్రబాబు రైతులపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పేపర్ క్లిప్పింగ్ ను, తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ రైతు భరోసా కార్యక్రమంలో అందించిన రైతు భరోసా సాయాన్ని గురించి చెప్పిన విజయసాయిరెడ్డి రైతును రాజులా చూసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని రైతులు దొంగలా చూసిన పార్టీ టిడిపి తెలుగు దొంగల పార్టీ అని ఆసక్తిగా పోస్ట్ పెట్టారు.
ఇక పల్నాడు జిల్లా కంభంపాడులో తెలుగు తమ్ముళ్లు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు అంటూ గాంధీ విగ్రహానికి టిడిపి జెండాలు పెట్టిన ఈ వార్తకు సంబంధించిన పేపర్ క్లిప్పింగులు పోస్ట్ చేసిన విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేశారు. గాంధీజీ బ్రిటిష్ వారితో పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ కనుక, అలా గాంధీజీకి టిడిపి జెండాలు పెట్టారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.