Vijayawada Floods: బుడమేరు గండ్లన్నీ పూడ్చివేత-మళ్లీ బెజవాడలో భారీ వర్షం..!
ఏపీలోని విజయవాడను తాజాగా భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఓవైపు కృష్ణానదికి వచ్చిన వరద, మరోవైపు బుడమేరు కాలువకు పడిన గండ్లూ నగర వాసులకు ప్రత్యక్ష నరకం చూపించాయి. ముఖ్యంగా బుడమేరు కాలువకు మూడు చోట్ల పడిన గండ్లతో నగరంలోకి భారీగా వరద నీరు చేరి పలు కాలనీలు జలమయం అయ్యాయి. దీంతో లక్షలాది మందిపై ఈ ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా బుడమేరు కాలువకు మరమ్మత్తులు చేస్తున్నారు.
బుడమేరు కాలువకు పడిన మూడు గండ్లను ఒక్కొక్కటిగా పూడ్చే పనులు ప్రారంభించిన ప్రభుత్వం ఇవాళ వాటిని పూర్తి చేసింది. నిన్నటికే రెండు గండ్లూ పూడ్చేసిన అధికారులు.. ఇవాళ ఆర్మీ సాయంతో మూడో గండినీ పూడ్చేశారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మంత్రులు, అధికారులు, ఆర్మీ సిబ్బంది కలిసి సంయుక్తంగా ఆ ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో ఇక నగరానికి బుడమేరు వరద నీరు రాకుండా అడ్డుకట్ట పడినట్లయింది. అయితే ఇప్పటికే నగరంలోకి వచ్చిన వరద నీటిని తోడాల్సి ఉంది.

మరో రెండు గంటల్లో పూర్తికానున్న బుడమేరు గండ్లు పూడిక పనులు. గత 5 రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతున్న పనులు. 4 రోజులుగా గట్టుపైనే గడుపుతూ పూడిక పనులు శరవేగంగా జరిగేలా దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్న మంత్రి నిమ్మల.#APGovtWithFloodVictims#VijayawadaFloods#CBNsFatherlyCare… pic.twitter.com/kHcmfpFfEY
— Telugu Desam Party (@JaiTDP) September 7, 2024
మరోవైపు ఇవాళ ఉదయం బుడమేరు గండి పూడిక పూర్తవుతున్న సమయంలోనే నగరంలో భారీ వర్షం కురిసింది. ఓవైపు నిన్నటి నుంచి పెరుగుతున్న బుడమేరు వరదకు తోడు ఇవాళ భారీ వర్షం కురవడంతో జనం ఆందోళనకు లోనయ్యారు. అయితే కాసేపటికే వర్షం తెరిపినిచ్చింది. దీంతో జనం కూడా ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్ని మరింత వేగవంతం చేస్తున్నారు. రేపు, ఎల్లుండిలో వరద ప్రాంతాల్లో బురదను పూర్తిగా తొలగించే పనిలో సిబ్బంది నిమగ్నం అవుతున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా వరద నీరు అలాగే ఉండడంతో దాన్ని ఎలా తోడాలన్న దానిపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications