ప్రైవేటు చేతుల్లోకి బెజవాడ రైల్వే స్టేషన్- 99 ఏళ్ల లీజు- రీడెవలప్మెంట్ పేరుతో
దశాబ్దాల చరిత్ర కలిగిన విజయవాడ రైల్వే స్టేషన్ ప్రైవేటు చేతుల్లోకి వెళ్లిపోతుందా ? ఇక స్టేషన్లోకి అడుగుపెట్టగానే ప్రయాణికులపై యూజర్ ఛార్జీల మోత తప్పదా ? పునరాభివృద్ధి పేరుతో రైల్వేబోర్డు చేస్తున్న ప్రయత్నాలు విజయవాడ జంక్షన్ ఉసురుతీయబోతున్నాయా ? దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేయడం ద్వారా ఆర్దిక వ్యవస్దను, తద్వారా స్దిరాస్ది రంగాన్ని పరుగులు తీయించాలన్న కేంద్రం ఆలోచనే ఇందుకు కారణమా ? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అదే జరిగితే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో రైల్వేస్టేషన్ ఎలా ఉండబోతోందో ఊహకు కూడా అందడం లేదు.
బేరానికి బెజవాడ రైల్వే స్టేషన్
దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి ( రీడెవలప్మెంట్) పేరుతో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం ద్వారా వాటిలో సదుపాయాలు, సౌకర్యాలు అభివృద్ధి చేసి తద్వారా భారీ ఎత్తున నిధులు సమకూర్చుకోవాలని కేంద్రం యోచిస్తోంది. ఇదే విషయాన్ని మొన్నటి కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించిన కేంద్రం.. రైల్వే బోర్డు ద్వారా తాము అనుకున్న వ్యూహాన్ని అమల్లోకి తెస్తోంది. దేశంలో రద్దీగా ఉన్న కొన్ని ప్రధాన రైల్వేస్టేషన్లను ముందుగా రీడెవలప్మెంట్ చేయాలని నిర్ణయించిన రైల్వేబోర్డు ఈ మేరకు విజయవాడను తొలిదశలో ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
99 ఏళ్ల లీజుకు విజయవాడ స్టేషన్
గతంలో 30 ఏళ్ల లీజుకు విజయవాడ రైల్వేస్టేషన్ను లీజుకు ఇచ్చేందుకు రైల్వేశాఖ ప్రతిపాదనలు చేసింది. అయితే అవి కార్యరూపం దాల్చలేదు. దీనికి ప్రధాన కారణం 30 ఏళ్ల లీజు సరిపోదని బిడ్డర్లు భావించడమే. దీంతో బిడ్డర్లు ఆసక్తి చూపక ఆ ప్రతిపాదన మరుగున పడింది. ఇప్పుడు దాని స్ధానంలో 99 ఏళ్ల లీజును రైల్వేశాఖ తెరపైకి తెస్తోంది. కార్పోరేట్ సంస్ధలకు దీర్ఘకాలం పాటు లీజుకిస్తేనే మంచి ఫలితాలు ఉంటాయని రైల్వేబోర్డు భావిస్తుండటమే ఇందుకు కారణం. దీంతో దేశంలో విజయవాడతో పాటు ఎంపిక చేసిన ఏ1 కేటగిరీ స్ఠేషన్లను పూర్తిగా ప్రైవేటీకరణ చేయబోతున్నారు.
విజయవాడ జంక్షన్ చరిత్ర
ఎప్పుడో స్వాతంత్రానికి పూర్వం 1888లో ప్రారంభమైన విజయవాడ రైల్వేస్టేషన్కు ఘనమైన చరిత్ర ఉంది. 30 ఎకరాల్లో విస్తరించిన ఈ రైల్వేస్టేషన్లో 10 ప్లాట్ఫారాలు ఉన్నాయి. సాధారణ రోజుల్లో రోజూ 250 రైళ్లు విజయవాడ జంక్షన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. ఇప్పుడు కరోనా కాలంలోనూ రోజుకు కనీసం 150 రైళ్లు ప్రయాణిస్తున్నాయి. గతంలో దాదాపు 2 లక్షలుగా ఉన్న రద్దీ ఇప్పుడు కరోనా కారణంగా లక్ష వరకూ ఉంటోంది. స్టేషన్లో పది ప్లాట్ఫారాల్ని అనుసంధానిస్తూ మూడు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, విశ్రాంతి గదులు, లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, జనరల్, నాన్ ఏసీ, ఏసీ రెస్ట్ రూమ్లున్నాయి. పే అండ్ యూజ్ టాయిలెట్లు, అత్యాధునిక డిస్ప్లే వ్యవస్ధలూ ఉన్నాయి. ఇప్పటికే నేషనల్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ గోల్డెన్ అవార్డుతో పాటు ఐఎస్ఓ హోదా కూడా సాధించింది.
Recommended Video
ప్రైవేటీకరణపై విమర్శలు
విజయవాడ డివిజన్ దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్ తర్వాత అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టే డివిజన్. ఓవైపు అత్యాధునిక సౌకర్యాలు ఉండీ, భారీ ఆదాయం కలిగిన విజయవాడ స్టేషన్ను రీడెవలప్మెంట్ పేరిట ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలని రైల్వేశాఖ భావిస్తోంది. దీనిపై ప్రయాణికులతో పాటు రైల్వే కార్మికులు, అధికారుల నుంచీ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నష్టాల పేరుతో ప్రభుత్వ రంగ సంస్దల్ని ప్రైవేటీకరణ చేస్తున్న కేంద్రం... లాభాల్లో ఉన్న రైల్వే స్టేషన్లనూ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం ఏంటన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి.
అయితే కేంద్రం తీసుకున్న నిర్ణయం మేరకే రీడెవలప్మెంట్ ప్రయత్నాలు జరుగుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. గతంలో గుజరాత్, భోపాల్ లో స్టేషన్లను ఇదే కోవలో రీడెవలప్మెంట్ చేసిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.