విజయవాడ వెస్ట్ బైపాస్ పై మరో గుడ్ న్యూస్..! ఆ రూట్ లో అనుమతి..!
విజయవాడ పశ్చిమబైపాస్ పై మరో అప్డేట్ వచ్చేసింది. అమరావతి రాజధాని నిర్మాణం నేపథ్యంలో విజయవాడ-గుంటూరు నగరాలతో పాటు చెన్నై-హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగించే వారికి ఉపయోగపడేలా నిర్మిస్తున్న ఈ బైపాస్ లో మరో స్ట్రెచ్ (మార్గం)ను రాకపోకలకు అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సంక్రాంతికి ఈ మార్గం వాహనదారులకు అందుబాటులోకి రాబోతోంది. ఈ మేరకు వేగంగా అడుగులు పడుతున్నాయి.
విజయవాడ పశ్చిమ బైపాస్ ప్రస్తుతం రెండు భాగాలుగా పూర్తవుతోంది. ఇందులో గుంటూరు జిల్లా కాజా నుంచి ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి వరకూ ఓ భాగం 17.88 కిలోమీటర్లు, గొల్లపూడి నుంచి కృష్ణాజిల్లా చిన అవుటపల్లి వరకూ మరో భాగంగా 30 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నారు. ఇందులో గొల్లపూడి నుంచి చినఅవుటపల్లి వరకూ 30 కిలోమీటర్ల మార్గం పూర్తయింది. దీంతో గతేడాది నవంబర్ నుంచే వాహనాల్ని అనుమతిస్తున్నారు. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా మరో మార్గం కూడా ఓపెన్ చేస్తున్నారు.

గుంటూరు జిల్లా కాజా నుంచి గొల్లపూడి మధ్య ఉన్న స్ట్రెచ్ లో ఒకవైపు వాహనాలను అనుమతించబోతున్నారు. దీంతో చెన్నై నుంచి గుంటూరు మీదుగా వచ్చే వాహనాలు ఏలూరు వైపు వెళ్లాలంటే ఇకపై విజయవాడ నగరంలోకి రావాల్సిన అవసరం లేదు. నేరుగా కాజా నుంచి బైపాస్ మీదుగా చిన అవుటపల్లికి వెళ్లిపోయేందుకు అవకాశం లభించనుంది. అయితే రెండోవైపు (గొల్లపూడి-కాజా) మాత్రం ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ నెలాఖరుకు వీటిని అనుమతించనున్నారు.

అయితే ఈ ఏడాది ఏప్రిల్ నాటికి కాజా నుంచి చిన అవుటపల్లి వరకూ పూర్తి స్ధాయిలో విజయవాడ పశ్చిమ బైపాస్ అందుబాటులోకి రానుంది. అప్పుడు చెన్నై-కోల్ కతా మధ్య రాకపోకలు సాగించే వాహనాలన్నీ విజయవాడతో సంబంధం లేకుండా ఈ బైపాస్ మీదుగా వెళ్లిపోయేందుకు అవకాశం లభించనుంది. అలాగే కాజా, పొట్టిపాడు టోల్ ప్లాజాల్ని సైతం ఈ బైపాస్ లో విలీనం చేయబోతున్నారు. అప్పుడు ఏలూరు-విజయవాడ మధ్య ఓ టోల్ ప్లాజా తగ్గిపోయే అవకాశం కూడా ఉంది.












Click it and Unblock the Notifications