కదం తొక్కిన విశాఖ ఉక్కు కార్మికులు .. స్టీల్ ప్లాంట్ కొనుగోలుకు ఎవరొచ్చినా అడ్డుకుంటామని ఫైర్ !!
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న దూకుడుపై విశాఖ కార్మిక సంఘాలు మండి పడుతున్నాయి. కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యాలని టెండర్లు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేయడంపై కార్మికులు నిప్పులు చెరుగుతున్నారు. ఈ క్రమంలో తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ నిరసనలు మరోమారు పెద్దఎత్తున కొనసాగుతున్నాయి.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆందోళన
విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీల నాయకులు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాస్తారోకో చేశారు. కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ వేదికగా ఎంపీలు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాడాలని పేర్కొన్నారు . ఈ నెల 10వ తేదీన విశాఖ స్టీల్ ప్లాంట్ కు మద్దతుగా నిరసన ప్రదర్శనకు అఖిలపక్ష ,కార్మిక, ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి.దీంతో మరొకమారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళనల పర్వం ఊపందుకుంది.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద కార్మిక సంఘాల ఆందోళన
ఈరోజు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ప్రక్రియ వేగవంతం చేయడంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈరోజు ఉదయం నుండి ఉద్యోగులు, కార్మిక సంఘాలు విశాఖ స్టీల్ ప్లాంట్ లోనికి ఎవరూ వెళ్లకుండా ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. వేల కోట్ల రూపాయలను పన్నుల రూపంలో చెల్లిస్తున్నస్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించడానికి నిర్ణయం తీసుకోవడంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకోసం చిత్తశుద్ధితో పనిచేయాలని కార్మిక సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు.

స్టీల్ ప్లాంట్ కొనుగోలుకు ఎవరైనా వస్తే అడ్డుకుంటామని స్పష్టం
కేవలం లేఖలు రాసి, తీర్మానాలు చేస్తే సరిపోదని వారు మండిపడుతున్నారు. స్టీల్ ప్లాంట్ కొనుగోలు చేయడానికి ఎవరు వచ్చినా వారిని విశాఖ విమానాశ్రయంలో అడ్డుకుంటామని కార్మిక సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. ఎట్టిపరిస్థితిలోనూ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేస్తే ఊరుకోబోమని తేల్చి చెబుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని బిజెపి మినహా అఖిల పక్షాల నేతలందరూ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం కార్మికులు తీవ్ర ఆగ్రహానికి కారణం అవుతుంది.
Recommended Video

తాజా పరిస్థితులతో మరోమారు తెరమీదకు విశాఖ ఉక్కు ఉద్యమం
తాజా పరిణామాల నేపథ్యంలో మరోమారు విశాఖ ఉక్కు పోరాటం పెద్ద ఎత్తున కొనసాగుతుందని అర్థమవుతుంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం ఏపీ సర్కార్ పై కూడా ఒత్తిడి తీసుకురావాలని కార్మిక సంఘాలు, విపక్ష పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే టీడీపీ నాయకులు జగన్ సర్కార్ పై ధ్వజమెత్తుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పార్లమెంట్ లో ఎంపీలు విశాఖ స్టీల్ కోసం పోరాటం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications