కేంద్రమంత్రి వ్యాఖ్యలకు భగ్గుమన్న విశాఖ ఉక్కు కార్మికులు, బైక్ ర్యాలీలతో నిరసన
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు 400 రోజులకు పైగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అయినప్పటికీ పట్టిన పట్టు విడవకుండా కేంద్ర ప్రభుత్వం మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసి తీరుతామని తేల్చి చెబుతోంది.
లోక్ సభలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం సరైందన్న కేంద్ర మంత్రి
తాజాగా పార్లమెంటు సమావేశాలలో లోక్సభలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం సరైనదేనని బదులిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై టిడిపి, వైసిపి ఎంపీలు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడుల ఉపసంహరణ వల్ల కంపెనీలు బాగు పడ్డాయని 2019 - 20 ఆర్థిక సర్వే వెల్లడించిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం సరైన నిర్ణయమని ఆయన వెల్లడించారు.
కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై నిరసన.. బైక్ ర్యాలీ నిర్వహించిన కార్మికులు
ఈ అంశాన్ని పునః పరిశీలించాల్సిన అవసరం లేదని విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించి తీరుతామని ఉక్కు శాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్ మరోమారు లోక్ సభ వేదికగా స్పష్టం చేశారు. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై లోక్ సభలో కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ద్విచక్ర వాహనాలతో కార్మిక సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద నిరసన.. కేంద్ర మంత్రిపై ఫైర్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద నిరసన తెలియ చేసిన విశాఖ ఉక్కు కార్మికులు ప్లకార్డులు చేతబట్టి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం తన మొండి వైఖరిని విడనాడాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్రను కించపరిచే విధంగా కేంద్రమంత్రి వ్యాఖ్యలు చేయడాన్ని కార్మికులందరూ ఏకకంఠంతో ఖండించాలని కార్మిక సంఘాల నాయకులు కోరారు. దేశ ప్రజలను కేంద్రమంత్రి తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ మండిపడ్డారు.
28వ తేదీన విశాఖ బంద్ ను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల పిలుపు
ప్రైవేట్ పరిశ్రమలకు బొగ్గును కేటాయిస్తున్న కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ కు మాత్రం బొగ్గు ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం తీరుకు నిరసనగా ఈనెల 28వ తేదీన విశాఖ బంద్ ను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించడం కోసం ఎన్ని ఆందోళనలు చేపట్టినా, బీజేపీ మినహా రాష్ట్రంలోని పార్టీలన్నీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికుల పక్షాన పోరాటం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వ ధోరణిలో ఏ మాత్రం మార్పు లేదు.