విశాఖ గూఢచర్యం కేసులో ఎన్ఐఏ మరో ఛార్ఝిషీట్-నేవీ సిబ్బందికి పాకిస్తానీ లంచాలపై
గతేడాది విశాఖపట్నంలోని తూర్పు నావికాదళంలో బయటపడిన గూఢచర్యం కేసులో పురోగతి లభించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఇమ్రాన్ యూసుఫ్ గిటేలీపై అభియోగాలు నమోదు చేస్తూ ఎన్ఐఏ అదనపు ఛార్జిషీట్ దాఖలు చేసింది. గతేడాది 14మంది నిందితులపై అభియోగాలతో ఛార్జిషీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ తాజాగా మరో ఛార్జిషీట్ దాఖలు చేసినట్లయింది.
విశాఖలో తూర్పు నౌకాదళానికి సంబంధించిన కీలక సమాచారాన్ని ఇచ్చేందుకు నౌకాదళానికి చెందిన దాదాపు పది మంది సిబ్బంది లంచాలు తీసుకున్నారు. గుజరాత్కు చెందిన కీలక నిందితుడు ఇమ్రాన్ యూసుఫ్ గిటేలీకి ఈ సమాచారాన్ని వారు అందించినట్లు తెలిసింది. దీంతో ఈ సమాచారం పాకిస్తాన్కు చేరిందని ఎన్ఐఏ భావిస్తోంది. ఈ కేసులో 14 మంది నిందితులపై గతేడాది జూన్లో ఎన్ఐఏ తొలి ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఆ తర్వాత కేసులో మరిన్ని నిజాలు వెలుగు చూశాయి.
ఈ కేసులో గుజరాత్లోని పంచ్మహల్కు చెందిన ప్రధాన నిందితుడు ఇమ్రాన్ యూసుఫ్ గిటేలీపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎన్ఐఏ తాజాగా ప్రకటించింది. దీంతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం యూఏపీఏ కింద కూడా కేసులు పెట్టారు. ఆయా సెక్షన్ల కింద నమోదు చేసిన కేసులతో తాజా అభియోగపత్రాన్ని విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో దాఖలు చేసినట్లు ఎన్ఐఏ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఇమ్రాన్ తరచుగా పాకిస్తాన్ వెళ్లేవాడని, అక్కడి ఏజెంట్లతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఎన్ఐఏ ఇందులో ఆరోపించింది. పాకిస్తాన్కు కీలక సమాచారం అందించేందుకు వీలుగా ఆయన కొందరు గూఢచారులను కూడా నియమించుకున్నట్లు ఆరోపించింది. ఇందులో భారత నౌకలు, జలాంతర్గాములు, ఇతర రక్షణ స్ధావరాల సమాచారం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్లో ఏజెంట్ల ఆదేశాల మేరకు ఇమ్రాన్ నేవీ సిబ్బంది ఖాతాల్లోకి డబ్బు పంపినట్లు ఎన్ఐఏ అభియోగాలు మోపింది.