మూడో స్థానంలో జనసేన విశాఖ అభ్యర్థి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ .. షాక్ ఇచ్చిన విశాఖ ప్రజలు
ఏపీ ఎన్నికల్లో జనసేన ప్రభావం చూపిస్తుంది అని అందరూ భావించారు. కానీ అంచనాలు తారుమారు అయ్యాయి. అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి. ఈ ఎన్నికల్లో జనసేన కనీసం 6,7 స్థానాలు కచ్చితంగా గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆ ఆశలన్నీ అడియాశలయ్యాయి.పవన్ కళ్యాణ్ పార్టీలో ప్రభావం చూపించగల నేతలు సైతం ఘోర ఓటమిని చవి చూసారు. అంతెందుకు పార్టీ అధ్యక్షుడే ఘోరంగా ఓడిపోయాడు. ఇక పవన్ పార్టీలో ప్రభావం చూపించగల నేత గా , సిన్సియర్ ఆఫీసర్ గా గుర్తించబడిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సైతం ఘోరంగా ఓటమి పాలయ్యారు.
చంద్రబాబు కొంప ముంచింది పవనేనా ... అసలేం జరిగింది
విశాఖలో ప్రభావం చూపించలేకపోయిన జనసేన అభ్యర్థి మాజీ జేడీ లక్ష్మీ నారాయణ
ఏపీలో అందరి దృష్టి ఆకర్షించిన విశాఖ లోక్ సభ జనసేన అభ్యర్థి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు. మూడో స్థానానికి పరిమితం అయ్యారు. . విశాఖ లోక్ సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీచేసిన లక్ష్మీనారాయణ ఏ మాత్రం విశాఖలో ప్రభావం చూపించలేకపోయారు . నిజాయతీపరుడైన పోలీసు ఆఫీసర్ గా, సీబీఐ మాజీ జేడీగా గుర్తింపు పొందిన లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వచ్చి ప్రజా క్షేత్రంలో తిరిగి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు . జనసేనలో చేరి తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన ఆయన విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు.
విశాఖ మ్యానిఫెస్టో బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చినా ఆదరించని విశాఖ వాసులు
విశాఖ నుంచి పోటీచేయడంతో ఆసక్తి నెలకొంది. పోటీ చెయ్యటమే కాదు ప్రజల్లో భరోసా కల్పించేందుకు జనసేన అధికారంలోకివస్తే విశాఖలో ఏం చేస్తుందో ఆ మ్యానిఫెస్టో బాండ్ పేపర్ మీద రాసి మరీ ప్రజలకు ఇచ్చారు. దీంతో అందరి దృష్టి ఆయనపై పడింది. లక్ష్మీనారాయణ గెలుపు ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. విశాఖ నగర ఓటర్ల నుంచి ఆయనకు మంచి మద్దతే లభించింది. అయితే అనూహ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ ప్రభంజనంతో లక్ష్మీనారాయణకు ప్రతికూలంగా మారింది. పట్టణ ఓటర్ల నుంచి మంచి స్పందన దక్కినా, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పూర్తిగా దెబ్బ తిన్నారు లక్ష్మీ నారాయణ . దీనికి కారణం గ్రామస్థాయిలో సరైన నాయకత్వం లేక, సంస్థాగత లోపంతో ఆయనకు ఓట్లు పడలేదు. దీంతో లక్ష్మీనారాయణ మూడో స్థానానికే పరిమితమయ్యారు. కనీసం రెండో స్థానంలో ఉండి గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయారు.
విశాఖ లోక్ సభా స్థానంలో వైసీపీ విజయం ... మూడో స్థానానికి పరిమితం అయిన లక్ష్మీ నారాయణ
ఫలితంగా విశాఖ లోక్సభ స్థానంలో వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ విజయం సాధించారు. ఇక్కడ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆఖరి రౌండ్ వరకూ ఉత్కంఠగా సాగింది. తొలిరౌండ్ నుంచి వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ స్వల్ప ఆధిక్యం సాధించినప్పటికీ.. 15 రౌండ్ల అనంతరం టీడీపీ అభ్యర్థి భరత్ ఆధిక్యంలోకి వచ్చారు. ఆ తర్వాత రౌండ్ల లెక్కింపు నెమ్మదిగా సాగింది. దీంతో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 20వ రౌండ్ నుంచి వైసీపీ అభ్యర్థి సత్యనారాయణ ఆధిక్యం ప్రదర్శించారు. చివరికి 3వేల 723 ఓట్ల ఆధిక్యంతో టీడీపీ అభ్యర్థి శ్రీభరత్పై విజయం సాధించారు. ఇక, విశాఖ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన పురందేశ్వరికి డిపాజిట్ కూడా దక్కలేదు. లక్ష్మీ నారాయణ కనీసం గట్టి పోటీ ఇవ్వలేకపోయాడు .