బతిమాలుకుని మంత్రిని కలవాల్సి వస్తోంది: నారాయణపై విష్ణుకుమార్ రాజు ఫైర్
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణపై భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు ప్రజారోగ్యం గురించి పట్టదని మండిపడ్డారు.
ఆ మంత్రి ఫోన్ ఎప్పుడూ బిజీగానే ఉంటుందనీ.. పుష్కరాల ముగిసిన తర్వాతనైనా ఆయన కార్మికుల సమస్యలపై స్పందించలేరా? అని నిలదీశారు. విశాఖపట్నంలో ఆదివారం విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
మున్సిపల్ కార్మికుల సమ్మె ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని, కార్మికులతో చర్చలు జరపాలని కోరేందుకు అయిదు రోజులు పాటు ఆయన్ను కలుసుకునేందుకు ప్రయత్నించానన్నారు.
ఆఖరుకు రాజమండ్రికి వెళ్లి గన్మన్లను బతిమాలుకుని మంత్రిని కలిశానని విష్ణుకుమార్ రాజు తెలిపారు. శాసనసభా బిజెపిపక్ష నేతనైన తనకే ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆయన మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి దృష్టికి తీసుకెళతాన అన్నారు.