botsa on land pooling: బలవంతంగా భూసేకరణ చేయం, పేదల కోసమేనని స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్ ప్రజలు చైతన్యవంతులు కాబట్టే టీడీపీని పక్కనబెట్టారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖ ప్రజలు వివేకవంతులు అయినందునే చంద్రబాబు బృందాన్ని ప్రతిపక్షంలో కూర్చొపెట్టారని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రజా చైతన్య యాత్ర పేరుతో ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. వారు చైతన్యవంతులని.. గత ఎన్నికల్లో ఇచ్చిన తీర్పే ఇందుకు నిదర్శమని చెప్పారు.
నిబంధనల మేరకే..
విశాఖపట్టణంలో ల్యాండ్ పూలింగ్ నిబంధనల మేరకు జరుగుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. తాము చేస్తోన్న ల్యాండ్ పూలింగ్ పేద ప్రజల కోసం అని వివరించారు. పేదల ఇళ్ల పట్టాల కోసం, గృహ అవసరాల కోసం కార్యక్రమం చేపట్టామని వివరించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మాదిరిగా దురుద్దేశంతో చేయడం లేదన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రం దోచుకోవడానికి ప్రయారిటీ ఇచ్చిందని.. అవినీతికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని బొత్స మండిపడ్డారు.
విశేష ఆదరణ..
భూములు కూడా ప్రజలు స్వచ్చందంగా ముందుకొస్తే తీసుకుంటున్నామని బొత్స స్పష్టంచేశారు. ఆయా చోట్ల ఉన్న భూమికి బహిరంగ మార్కెట్లో రూపాయి ఎక్కువే ఇచ్చి సేకరిస్తున్నామని తెలిపారు. అక్కడి ప్రజలు ఇష్టపూర్వకంగా భూములు ఇస్తే తీసుకోవాలని సీఎం జగన్ సూచించారని బొత్స సత్యనారాయణ గుర్తుచేశారు. సామాన్యుల కోసం చేపట్టిన ల్యాండ్ పూలింగ్కు మంచి ఆదరణ లభిస్తోందనన్నారు.
అప్పుడేం చేశారు..
తమపై అవాకులు చెవాకులు పేలే చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ హయాంలో ఏం చేశారని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో 20 ఏళ్లు టీడీపీ అధికారంలో ఉందని, విడిపోయాక ఐదేళ్లు టీడీపీ అధికారం చేపట్టిన.. సంక్షేమ పథకాలు ఎందుకు సక్రమంగా అమలు చేయలేదన్నారు. అప్పుడు విశాఖపట్టణం గుర్తురాలేదా అని అడిగారు. అధికారంలో ఉన్నప్పుడు మరచిపోయి.. ఇప్పుడు విశాఖ అంటూ ప్రజా చైతన్య యాత్ర చేస్తున్నారని తనదైనశైలిలో బొత్స విమర్శించారు.
Recommended Video
ఒక్కొక్కరు జారిపోతారు..?
ప్రజా చైతన్య యాత్ర తర్వాత టీడీపీకి ఒక్క ఒకటో అర సీట్లు కూడా జారిపోతాయని ఎమ్మెల్యేల ఫిరాయింపును బొత్స ప్రస్తావించారు. టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. ఇద్దరు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ సంఖ్య మరింత తగ్గుతోందని బొత్స పేర్కొన్నారు. మోసం చేయడంలో, మాయమాటలు చెప్పడంలో, మేనెజ్మెంట్ నడపడంలో చంద్రబాబు ఆరితేరిన సంగతి తెలిసిందేనని విమర్శించారు. కానీ గత ఎన్నికల్లో వైసీపీ చెప్పిన సంక్షేమ పథకాలు.. జగన్ మీద విశ్వాసంతో ప్రజలు అధికారం కట్టబెట్టారని బొత్స సత్యనారాయణ గుర్తుచేశారు.