ఆంజనేయుడు లేని రామాలయం దేశంలో ఇదొక్కటే!
వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట లోని ప్రఖ్యాత రామాలయంలో కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి మూలమూర్తులు. కడప నుంచి తిరుపతి వెళ్లే మార్గంలో కడపకు 27 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. సీత, రాముడు, లక్ష్మణ విగ్రహాలు ఏకశిలో ఉండటంవల్ల దీన్ని ఏకశిలా నగరం అని కూడా పిలుస్తారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ భద్రాచలంగా పేరుపొందింది. శ్రీరామనవమి రోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమలు నిర్వహిస్తోంది. ఆరోజు దేవస్థానానికి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రికానీ, దేవాదాయశాఖ మంత్రికానీ పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారు.
రామ లక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్న సమయంలో విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకువచ్చాడు. సీతారాముల కల్యాణం జరిగిన తర్వాత కూడా అటువంటి సందర్భం ఒకటి ఎదురైంది. మృకండు మహర్షి, శృంగి మహర్షి శ్రీరాముణ్ని దుష్టశిక్షణ కోసం ప్రార్థిస్తారు. సీతా లక్ష్మణ సమేతుడై అంబులపొది, పిడిబాకు, కోదండం పట్టుకుని యాగరక్షణకు శ్రీరాముడు తరలివస్తాడు. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారు. తర్వాత జాంబవంతుడు ఈ విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేశాడు. ఈ దేవస్థానంలో శ్రీరామ తీర్థం ఉంది. సీత కోరికపై శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థలపురాణం చెబుతోంది.

"భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి" అని ఫ్రెంచి యాత్రికుడు ట్రావెర్నియర్ 16వ శతాబ్దంలో ఈ రామాలయాన్ని సందర్శించిన అనంతరం కీర్తించాడు. తాను ఏకశిలపురి వాసినని మహా కవి పోతన చెప్పుకున్నాడు. తాను రచించిన భాగవతాన్ని ఈ కోదండ రాముడికి అంకితం చేశాడు. శ్రీరాముడి దేవాలయాల్లోని మూల విగ్రహాల్లో రాముడి విగ్రహం పక్కన ఆంజనేయుడి విగ్రహం లేని రామాలయం భారతదేశంలో ఇదొక్కటే. హనుమంతుడు శ్రీరాముణ్ని కలవడానికి ముందే ఒంటిమిట్టలోని సీతారామ లక్ష్మణుల ఏకశిలా విగ్రహాన్ని స్థాపించినట్లు కథనం ఉంది.
చంద్రుడి వెలుగులో స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఈ దేవాలయ ప్రత్యేకత. క్షీరసాగర మథనం తరువాత మహాలక్ష్మీదేవి అమ్మవారిని నారాయణుడు తన సతీమణిగా స్వీకరంచిన తర్వాత పగలు జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేకపోతున్నానని ఆమె సోదరుడు చంద్రుడు స్వామివారికి విన్నవించుకుంటాడు. ఒంటిమిట్టలో వెన్నెల వెలుగుల్లో తన కల్యాణాన్ని వీక్షించవచ్చని అప్పుడు నారాయణుడు చంద్రుడికి వరమిస్తాడు. దాని ప్రకారమే రాత్రిళ్లు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. శ్రీరామ నవమి ఉత్సవాలను ప్రతి సంవత్సరం తొమ్మిదిరోజులపాటు అంగరంగ వైభవంగా చేస్తారు.












Click it and Unblock the Notifications