అతనో వార్డు సభ్యుడు: చేసింది గొలుసు చోరీ, మహిళ కంట్లో కారం కొట్టి
వరంగల్: అతను ఓ గ్రామంలో వార్డు సభ్యుడిగా గెలిచాడు. అయితే, ఓ మహిళ మెడలోని బంగారం గొలుసును దొంగిలించి పోలీసులకు చిక్కాడు, వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండలంలోని సాల్వాపూర్లో ఈ నెల 5న మహిళ ముఖంపై కారంపొడి చల్లి బంగారు గొలుసు లాక్కెళ్లిన దొంగను బుధవారం పోలీసులు పట్టుకున్నారు. జనగామ డీఎస్పీ కూర సురేందర్ మీడియా సమావేశంలో అందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
అనుమానిత వ్యక్తులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు చేర్యాల మండలం చుంచనకోట వద్ద చేర్యాల సీఐ వెంకటేశ్వర్రెడ్డి, బచ్చన్నపేట ఎసైశ్రీనివాసరావు, ఐడీ పార్టీ బృందం సభ్యులు వాహనాలు తనిఖీని చేపట్టారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై సిద్దిపేట వైపు వెళ్తున్న వ్యక్తిని ఆపి వాహనాన్ని తనిఖీ చేయగా ఓ కవర్ బయటపడింది. అందులో బంగారు గొలుసు కనిపించింది.
ఇది ఎవరిదని ప్రశ్నించగా సాల్వాపూర్ గ్రామానికి చెందిన జంగిటి సత్తెమ్మదని నిందితుడు ఒప్పుకున్నాడు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించినట్లు సురేందర్ తెలిపారు. సాల్వాపూర్కు చెందిన సూర కనకయ్య గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడిగా గెలుపొందాడు. జంగిటి సత్తెమ్మ ఇంటి వెనుకనే ఉంటున్నాడు. ఈ నెల 5న సత్తెమ్మ భర్త నర్సయ్య వ్యవసాయబావి వద్దకు తెల్లవారు జామున వెళ్లాడు.
సత్తెమ్మ ఇంటి వరండాలోనే నిద్రిస్తుండగా కనకయ్య ఒక్కసారిగా వచ్చి ఆమె ముఖంపై కారంపొడి చల్లి మెడలో ఉన్న మూడున్నర తులాల బంగారుగొలుసు లాక్కెళ్లాడు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.