జల జగడం : దోపిడీలో తండ్రిని మించిన తనయుడు వైఎస్ జగన్, బీజేపీ తీరు అలా : మంత్రి పువ్వాడ ధ్వజం
ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. ఇరు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి .రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ కొనసాగుతున్నా తాజాగా తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలతో అది మరింత ముదిరింది. తెలంగాణ మంత్రులు ఆంధ్రప్రదేశ్ సర్కార్ పై మాటల తూటాలను ఎక్కువ పెడుతూనే ఉన్నారు.
వాటర్ వార్ : ఆంధ్రోళ్ళంతా లంక వాసులా ... తెలంగాణా మంత్రి వ్యాఖ్యలపై కర్నూలు టీడీపీ నేతలు ఫైర్
ఏపీ నీటి చౌర్యాన్ని తప్పకుండా అడ్డుకుని తీరుతాం
ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుతో తెలంగాణా రాష్ట్రానికి తీవ్ర నష్టం చేస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టారని ఏపీ సర్కార్ పై నిప్పులు చెరుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అక్రమ నీళ్ల తరలింపు పరాకాష్టకు చేరుకుందని, ఏపీ నీటి చౌర్యాన్ని తప్పకుండా అడ్డుకుని తీరుతామని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి అబద్ధాలు చెబుతూ అక్రమ ప్రాజెక్టులు నిర్మాణం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పువ్వాడ.
కేంద్రంలోని బీజేపీ, ఏపీ సర్కార్ కు సన్నాయి నొక్కులు
ఏపీ అక్రమ ప్రాజెక్టులపై తెలంగాణ భవన్ లో మంత్రి పువ్వాడ నిర్వహించిన మీడియా సమావేశంలో అటు బిజెపిపైన కూడా విరుచుకుపడ్డారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వానికి సన్నాయి నొక్కులు నొక్కుతోంది అని విమర్శించారు. బీజేపీ నేతలు ఏపీలో ఒకలా తెలంగాణలో మరోలా మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. తెలంగాణ విషయంలో దోపిడీలో తండ్రిని మించిన తనయుడు జగన్ మోహన్ రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పువ్వాడ అజయ్ కుమార్.
వైఎస్ పై ప్రశాంత్ రెడ్డి మాటలు వంద శాతం నిజం
తెలంగాణ సమాజాన్ని వైయస్ రాజశేఖర్ రెడ్డి చాలా చిన్న చూపు చూశారు అని పేర్కొన్న పువ్వాడ అజయ్ కుమార్ పోతిరెడ్డిపాడు అంశంపై కూడా తెలంగాణ ఉద్యమం సందర్భంగా కేసీఆర్ పోరాటం చేశారని స్పష్టం చేశారు. ఇక వైఎస్ పై మంత్రి ప్రశాంత్ రెడ్డి మాటలు వందశాతం నిజమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం తాను మాట్లాడుతున్నానని చెప్పిన మంత్రి పువ్వాడ రెండు రాష్ట్రాలకు సంబంధించిన నీటి వాటాలు ఇంకా తేలలేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ రెండు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని ఆకాంక్షించారు అని పువ్వాడ తెలిపారు.
సీఎం జగన్ జలదోపిడీని అడ్డుకుని తీరుతాం
ఇరు రాష్ట్రాలు భేషజాలకు పోకుండా న్యాయం చేద్దామని, గోదావరి జలాలను సమృద్ధిగా వినియోగించకుందామని సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. రాయలసీమకు నీళ్లు ఇస్తామన్న మాటలను ఏపీ వక్రీకరిస్తుందని ఆయన ఆరోపించారు. వైయస్ హయాంలో అద్భుతమైన ప్రాజెక్టులు కట్టామని చెబుతున్నారని, ఖమ్మం జిల్లాలో ఒక ఎకరానికి అయినా నీరు వచ్చిందా అంటూ ప్రశ్నించారు మంత్రి పువ్వాడ. ఇదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఏపీ ప్రభుత్వంతో సమరానికి సై అంటున్నామని చెప్పారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న జల దోపిడీని అడ్డుకుని తీరుతామని మంత్రి పువ్వాడ తేల్చి చెప్పారు.