కిరణ్కు కౌంటర్ కాదు, కప్పగంతులు మామూలే: ఆనం
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా తాము సమావేశం నిర్వహించలేదని ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంగళవారం చెప్పారు. సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు ఆనం నివాసంలో భేటీ అయ్యారు. అనంతరం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
తాము ముఖ్యమంత్రికి వ్యతిరేకం కాదన్నారు. ఆయన అభిప్రాయాలతో తాము వ్యతిరేకించడం లేదన్నారు. నాయకత్వ మార్పు అనేది కేవలం ఊహాగానాలే అన్నారు. ప్రజల్లో సమైక్యవాదం బలంగా ఉందని కిరణ్ కేంద్రానికి చెప్పే ప్రయత్నం చేశారన్నారు. ఆయన వ్యాఖ్యలను ఖండించాల్సిన అవసరం లేదన్నారు. కిరణ్కు కౌంటర్ ఇచ్చేందుకు తాము లేమన్నారు.

తాము కూడా సమైక్యవాదాన్ని అధిష్టానం ముందు బలంగా వినిపిస్తున్నామని చెప్పారు. చివరి వరకు తమ వాదనలు వినిపిస్తామని, సమైక్యాంధ్ర కోసం అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేస్తామన్నారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తూనే పార్టీని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తామన్నారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చునని చెప్పారు. తాము సేవ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ కాంగ్రెసు నినాదంతో ముందుకు వెళ్తామన్నారు.
జగన్ పార్టీలో చేరికలపై..
వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి పలువురు కాంగ్రెసు నేతలు వెళ్తున్న అంశంపై విలేకరులు ప్రశ్నించగా ఎన్నికల సమయంలో ఇలాంటి కప్పగంతులు సహజమే అన్నారు. 2009 ఎన్నికలకు ముందు కూడా ఉన్నాయన్నారు. కాగా, ఈ భేటీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు మహీధర్ రెడ్డి, సి రామచంద్రయ్య, వట్టి వసంత్ కుమార్, రఘువీరా రెడ్డి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications